ఏపీలో ఫింగర్ ప్రింట్ స్కామ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో ఫింగర్ ప్రింట్ స్కామ్

గుంటూరు, జూన్ 29 (way2newstv.com)
తెలంగాణలో సంచలనం రేపిన ఫింగర్ ప్రింట్ స్కామ్ ఏపీకి పాకింది. ఈ కేసులో ప్రధానంగా రిజిస్ట్రేషన్‌శాఖ వెబ్‌సైట్ నుంచే డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసినట్లు తేలడంతో.. ఏపీ రెవెన్యూశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకున్న వారిపై దృష్టి పెట్టారు. వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించగా.. ఆరు నెలల్లో ఏకంగా ఏడు లక్షల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇలా లెక్క తేలే అవకాశం లేకపోవడంతో.. జిల్లాలవారీగా నివేదికల్ని తెప్పించుకునే పనిలో ఉన్నారు. భవిష్యత్‌లోనూ డాక్యుమెంట్లను ఇష్టానుసారంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 
 
 
 
ఏపీలో ఫింగర్ ప్రింట్ స్కామ్
 
ఓటీపీ, బయోమెట్రిక్ ద్వారానే వీటిని తీసుకునే ప్రక్రియను అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల డౌన్ లోడింగ్ నిలిపివేయాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపైనా రెవెన్యూశాఖ అధికారులు స్పందించారు. కేంద్రం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ స్కామ్‌లో అరెస్టైన సంతోష్ విచారణలో కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్ నుంచే ఎక్కువ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు చెప్పాడు. వేలల్లో సిమ్‌కార్డుల్లో యాక్టివేషన్ చేయడమంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఏపీకి సంబంధించి కూడా ఏవైనా డాక్యుమెంట్లను సేకరించాడో అన్న కోణంలోనే అధికారులు ముందుగానే అప్రమత్తమై వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.