భీమవరం, జూలై 26, (way2newstv.com)
భిన్నత్వంలో ఏకత్వం ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ కనిపించదని, మతపరమైన శక్తులు మన ఐక్యతను ఎప్పటికీ దెబ్బ తీయలేవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో పవన్ కల్యాణ్ ను ముస్లిం సోదరులు కలిసి, వారి సమస్యలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని, ఒక ఫకీరుని భగవంతుడిని చేసిన సంస్కృతి మనదని పేర్కొన్నారు. మాంసాహారం తింటే జంతుప్రవృత్తి వస్తుందనడం తప్పని, శాకాహార రాష్ట్రం గుజరాత్ లో అత్యంత దారుణమైన మారణకాండ జరిగింది. దీన్నిబట్టి ఆహారపు అలవాట్లు మనుషుల ప్రవర్తన, ఆలోచనల్ని ప్రభావితం చేయవని అర్థం అవుతోందని చెప్పారు.
ఫకీరుని భగవంతుని చేసిన సంస్కృతి మనది
ముస్లింల బాధలు, కష్టాలు అర్థం చేసుకోగలను
మన ఐక్యతను మత శక్తులు దెబ్బతీయలేవు
ముస్లిం సోదరులతో సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
పేదరికం అన్ని కులాలు, అన్ని మతాల్లో ఉందని, రిజర్వేషన్లు ఉన్నా అమలు చేసే నాయకత్వం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే సింగపూర్ తరహా రాజధాని అంటారు కానీ, సింగపూర్ తరహా పాలన అందిస్తామని మాత్రం ఎక్కడ చెప్పరని ఎద్దేవా చేశారు. సింగపూర్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం అక్కడ అన్ని వర్గాల వారిని సమానంగా చూడటంతో పాటు అందరికీ ఒకే విధమైన చట్టాలు ఉండేలా లీ క్వాన్ యూ చేశారని తెలిపారు. మనకి గొప్ప రాజ్యాంగం ఉంది కానీ అమలు చేసే నాయకులే లేరన్నారు. ముస్లిం కుటుంబంలో పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి వాళ్లతో ఉన్న అనుబంధంతో వారి బాధలను అర్ధం చేసుకోగలనని చెప్పారు. ముస్లింలకు ప్రత్యేక స్కూల్స్ , హాస్టల్స్ అడుగుతున్నారు కానీ ముస్లింలను ప్రత్యేకంగా చూడటం అంటే వివక్ష చూపించడమే అన్నారు. అందరితో కలిసి కామన్ ఎడ్యుకేషన్, కామన్ హాస్టల్స్ ఉండేలా చూస్తామని, కుదరని పక్షంలో ప్రత్యేక స్కూల్స్ , హాస్టల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంట్లో ఆడపిల్లను చదివిస్తే కుటుంబం బాగుపడుతుందని, తద్వారా సమాజం బాగుపడుతుందని అన్నారు. ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లలు చదువుకునేలా జనసేన పార్టీ ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని హామీ ఇచ్చారు.