హైదరాబాద్ ఆగష్టు 18 (way2newstv.com)
గ్రామీణ విద్యార్ధులు విదేశాల్లో ఉపాధి పొందడం అభినందనీయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ అన్నారు. డీడీయూ జీకేవై ద్వారా జాగృతి టెక్నాలజీస్ సంస్థలో ఆరు నెలల శిక్షణ పొందిన తెలంగాణాకు చెందిన ముగ్గురికి దాదాపు 17 లక్షల వార్షిక వేతనంతో దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానికి దిగ్గజ సంస్థ శాంసంగ్లో ఉద్యోగాలు దక్కాయి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విజయ్కుమార్, వనపర్తి జిల్లాకు చెందిన ప్రత్యూష, పెద్దపల్లి జిల్లాకు చెందిన కుమార్లు హైదరాబాద్లో ఈసీఈలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా జాగృతి టెక్నోసిస్ సంస్థలో ఆరు నెలల పాటు శిక్షణ పొందారు. అనంతరం చిప్సాల్వ్ టెక్నాలజీస్లో ప్లేస్మెంట్ సంపాధించారు. మూడు నెలల అనంతరం నేరుగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని సాంసంగ్ ప్రధాన కార్యాలయంలో 24 వేల డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందారు. గురువారం రాత్రి వారు సియోల్ బయలుదేరి వెళ్లే ముందు సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్రావుతో కలిసి పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ను కలిశారు.గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న డీడీయూ జీకేవై ద్వారా శిక్షణ పొంది విదేశాల్లోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్లేస్మెంట్లు పొందడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ ప్రశంసించారు. ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులను వారు అభినందించారు. ప్రతి జిల్లాలోనూ డీడీయూ జీకేవై శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, తెలంగాణాలోని నిరుద్యోగులంతా ఈ ఉపాధిశిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
డీడీయూజీకేవై శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు