ఫారం-7పై వివాదం రోజుకో మలుపు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫారం-7పై వివాదం రోజుకో మలుపు

న్యూఢిల్లీ, మార్చి 8 (way2newstv.com)
డేటా చోరీ, ఫారం-7పై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే.. మరోవైపు పరస్పరం ఫిర్యాదుల పర్వానికి తెర తీశారు. వైసీపీ, టీడీపీలకు తోడు బీజేపీ కూడా రంగంలోకి దిగింది. డేటా చోరీతో పాటూ ఫారం-7పై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ డీజీపీని మార్చేయాలని కోరింది. ఢిల్లీలో సీఈసీని కలిసిన బీజేపీ నేతలు.. ఏపీ ప్రభుత్వం, చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. టీడీపీకి అనుకూలంగా లేనివాళ్ల ఓట్లు తొలగిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. 


ఫారం-7పై వివాదం రోజుకో మలుపు

అధికారులు కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. డీజీపీని మార్చాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆధార్, ఓటర్ల జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. థర్డ్ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించామన్నారు.  ఏపీ పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఫారం-7ను ఎవరైనా దరఖాస్తు చేయొచ్చని.. అది నిజమో కాదో ఎన్నికల సంఘం తేలుస్తుందన్నారు. ఆధార్, ఓటర్ డేటాను ఏపీ ప్రభుత్వం దొంగిలించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.