మహబూబ్ నగర్, మార్చి 9 (way2newstv.com):
ఆసరా పింఛన్లు ఇంకా గాడిలో పడలేదు. అయిదేళ్ల నుంచి కూడా లబ్ధిదారులకు పింఛను డబ్బు సక్రమంగా అందడం లేదు. ప్రతినెలా మొదటి వారంలోనే లబ్ధిదారులకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మొదటి నుంచి కూడా ప్రతినెలా చివరి వారంలోనో.. లేదంటే రెండు నెలలకు ఒకసారో పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 1,79,731 మంది ఆసరా పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వారికి ప్రతి నెలా రూ.20.74 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు రెండు గడిచి మూడో నెల ప్రారంభమైనా ఇప్పటి వరకు రాలేదు.
ఆదుకోని ఆసరా.. (మహబూబ్ నగర్)
వాస్తవంగా జనవరి నెలకు సంబంధించిన పింఛన్లు ఫిబ్రవరి మొదటి వారంలోనే పంపిణీ చేయాలి. ఇప్పటి వరకు పింఛను డబ్బు రాకపోవడంతో ప్రధానంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.1,500, వృద్ధులు, వితంతువులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు రూ.1,000 చొప్పున ఇవ్వాల్సి ఉంది.
ప్రతినెలా ఆసరా పింఛన్లు 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పంపిణీ చేశాక పూర్తి వివరాలను అదే నెల 15వ తేదీ నాటికి డీఆర్డీఏ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. అన్ని మండలాల వివరాలను తయారు చేసి వాటిని డీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ అనుమతితో పంపుతారు. వెంటనే మరో నెలకు సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. జిల్లాలో మాత్రం ప్రతినెలా పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతూనే ఉంది.