పౌర్ణమికి ముందు శ్రీవారి తెప్పోత్సవాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పౌర్ణమికి ముందు శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమల, మార్చి 18  (way2newstv.com)
తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభం కాగా, తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా స్వామివారు భక్తులకు  దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా తెప్పపై మూడు చుట్టులు తిరిగి భక్తులను శ్రీవారు అనుగ్రహించారు. రెండో రోజు ఆదివారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడిగా తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా  ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు వేంపు చేస్తారు. అనంతరం అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు  విహరించారు. మూడో రోజు శ్రీభూసమేతంగా సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలో తెప్పపై ఆశీనులై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. నాలుగో రోజు ఐదుసార్లు, 
చివరి రోజు మార్చి 20న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షించనున్నాలరు. తెప్ప అంటే పడవ, ఓడ, నావ. ఓడలో ఆశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారింపజేయడాన్నే తెప్పోత్సవం  అంటారు. 


పౌర్ణమికి ముందు శ్రీవారి తెప్పోత్సవాలు

తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాళ్ అని, తెలుగులో తెప్ప తిరునాళ్లు అనిఅంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నట్టు ఆధారాలు  వెల్లడిస్తున్నాయి. అయితే సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ‘నీరాళి మండపాన్ని’ నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీతాళ్లపాక  అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను ఘనతను కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీటిలో శ్రీ మలయప్ప స్వామిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు  చేస్తాయి. ఇక, టీటీడీ రూపొందించిన శ్రీ వికారినామ సంవత్సర పంచాంగాన్ని శనివారం ఆవిష్కరించారు. ధర్మ ప్రచారంలో భాగంగా ఏటా తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తులకు  టీటీడీ అందజేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ సిద్ధాంతి రూపొందించారు.వైఖానసాగమ పండితులు ఆచార్య  వేదాంతం విష్ణుభట్టాచార్యులు పరిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన పంచాంగం ధరను రూ.55గా నిర్ణయించారు. మొత్తం 60 వేల ప్రతులను టీటీడీ  ముద్రించింది. వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ సమాచార కేంద్రాలలో పంచాంగం అందుబాటులో రానుంది.