వారసుల చెట్టాపట్టాల్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వారసుల చెట్టాపట్టాల్...

అనంతపురం, మార్చి 21, (way2newstv.com)
అనంతపురం జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. పరిటాల కుటుంబం మొదటి నుంచి టీడీపీలో ఉండగా.. ఎంపీ జేసీ గత ఎన్నికల వేళ తెదేపాలో చేరారు. తాజా ఎన్నికల్లో మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇద్దరూ పోటీ నుంచి వైదొలగి వారి వారసులకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అనంతపురం వచ్చారు. ఈ సభలో మంత్రి సునీత తనయుడు శ్రీరామ్‌.. ఎంపీ జేసీ కుమారుడు పవన్‌ ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడమే కాక.. ఉమ్మడిగా అభివాదం చేశారు. చంద్రబాబు రాయలసీమలో చేస్తున్న అభివృద్ధితో ఫ్యాక్షనిజం కనుమరుగు అయింది. పరిటాల – జేసీ వర్గాలు ఒకపార్టీలో ఉంటాయని ఎవరైనా ఊహించారా..? జమ్మలమడుగులో రెండు వర్గాలు కలుస్తాయని అంచనాలున్నాయా…? కోట్ల – కేఈ కుటుంబాలు కర్నూలులో ఒకే జెండా కింద ఉంటాయని అనుకున్నారా..? ఈ మూడు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా రాజకీయం పోరాటంతో శత్రువులుగా మారిన ఎన్నో కుటుంబాలను.. చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో రాజకీయంగా ఒక్కటి చేశారు. 



వారసుల చెట్టాపట్టాల్...

సీమలో ఫ్యాక్షన్ కుటుంబాల్ని కలిపిన చంద్రబాబు చాణక్యం..! ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డిలను… ఒకే వేదికపై చూస్తామని… జమ్మల మడుగు రాజకీయాలపై అవగాహన ఉన్న ఏ ఒక్కరూ అనుకోరు. జేసీ దివాకర్ రెడ్డి – పరిటాల సునీతలు ఒకే పార్టీలో ఉంటారని.. ఎన్నికల ముందు ఎవరైనా ఊహించారా? కోట్ల - కేఈ కుటుంబాలు కలిసి రాజకీయం చేస్తారని కనీసం కలగన్నామా? ఫ్యాక్షన్ అంత లేకపోయినా… నారా రాజకీయానికి.. నల్లారి రాజకీయానికి అసలు సరిపడేది కాదు. కానీ.. ఇప్పుడు నల్లారి కుటుంబాన్ని కూడా.. టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు.కోస్తా నుంచి ఉత్తరాంధ్ర దాక శత్రువర్గాలుగా మారిన కుటుంబాలు .. ఇప్పుడు టీడీపీ గూటికి చేరి ఒక్కటయ్యాయి. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి – కరణం వర్గాల ఫ్యాక్షన్ చిచ్చు మారిపోయింది, వారు కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ సీట్లు కేటాయింపు జరగడంతో.. ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు లేవు. విజయవాడలో వంగవీటి, దేవినేని వర్గం మధ్య ఉండే తగాదాలు… చరిత్రలో చెరపలేని విధంగా ఉన్నాయి. ఇప్పుడు… దేవినేని అవినాష్… గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. వంగవీటి వారసుడు కూడా టీడీపీలో చేరారు. ఇక ఉత్తరాంద్రలో బొబ్బిలి రాజులు, విజయనగరం రాజుల మధ్య శతృత్వం ఇప్పటిది కాదు. కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి టీడీపీలోనే రాజకీయాలు చేస్తున్నారు. ఇక వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాల మధ్య అంతే వైరం ఉంది. రెండు కోటల పేర్లో వీరి మధ్య గొడవలు ఉండేవి. ఇప్పుడు ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. విభజించి పాలించడం అనే రాజకీయానికి చంద్రబాబు దూరం..! సాధారణంగా జిల్లాను లేదా.. నియోజకవర్గాన్ని శాసించగలిగే స్థితిలో ఉండే ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటారు. ఒకే పార్టీలో ఉండటం అసాధ్యం కానీ.. టీడీపీ అధినేత మాత్రం.. తన మార్క్ రాజకీయంతో అందర్నీ పార్టీలో ఉంచగలుగుతున్నారు. సాధారణంగా ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న వారు కలవడానికి అసలు ఆసక్తి చూపించరు. కానీ చంద్రబాబు.. ఫ్యాక్షన్‌కు కాలం చెల్లేలా.. వారందర్నీ.. ఒకే తాటిపైకి తీసుకు రాగలుగుతున్నారు. నిజానికి… రాజకీయ పార్టీల లక్షణం.. కలపడం కాదు.. విడగొట్టడం. పార్టీల అధిష్టానాలు ఇలాంటి బలమైన నేతల మధ్య వీలయినంత దూరం పెంచి.. దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు.