మరో 15 మందికి అస్వస్థత.. ముగ్గురి పరిస్థితి విషమం
మెరుగైన వైద్యం అందించండి: ఈటల
హైదరాబాద్ మార్చ్ 7 (way2newstv.com)
నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో దారుణం చోటుచేసుకుంది. టీకాలు వికటించిన ఘటనలో ఐదు నెలల చిన్నారి మృతిచెందగా.. మరో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో బుధవారం ఉదయం దాదాపు 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. వీరంతా 3 నుంచి 5 నెలల వయసున్నవారే కావడం గమనార్హం. వ్యాక్సిన్ అనంతరం జ్వరం రాకుండా ఇవ్వాల్సిన మాత్రలు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
వికటించిన వ్యాక్సిన్.. చిన్నారి మృతి
అయితే, వ్యాక్సిన్ వేయడం వల్ల ఇలా జరిగిందా? లేదా మాత్రల వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఘటన అనంతరం చిన్నారులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నీలోఫర్లో 15 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పరిస్థితిపై ఆరాతీశారు. మరోవైపు వైద్యాధికారులు ఈ ఘటనపై కమిటీ వేసి విచారణ జరుపుతున్నారు. ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నీలోఫర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
మెరుగైన వైద్యం అందించండి: ఈటల
వ్యాక్సిన్లు వికటించిన ఘటనపై ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని నీలోఫర్ వైద్యులకు ఆదేశించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే హుజూరాబాద్ నుంచి నీలోఫర్కు బయల్దేరారు.