రేసు రసవత్తరం (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రేసు రసవత్తరం (ఖమ్మం)

ఖమ్మం, ఏప్రిల్ 1(way2newstv.com)
ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఈ దఫా ఎన్నికలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఇప్పటికే రెండుసార్లు తలపడిన ప్రత్యర్థులు మళ్లీ పోటీకి ‘సై’ అంటున్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేణుకాచౌదరి, తెదేపా అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రేణుకా చౌదరి 1,08,888 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  2009లో అవే పార్టీల తరపున మళ్లీ వీరిద్దరే పోటీ చేయగా ఈసారి నామా నాగేశ్వరరావు 1,24,448 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో కాంగ్రెస్‌-సీపీఐ పొత్తు పెట్టుకోగా మిత్రపక్షమైన సీపీఐకి కాంగ్రెస్‌ ఎంపీ సీటు కేటాయించింది. సీపీఐ అభ్యర్థిగా కె.నారాయణ, తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు, వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీపడ్డారు. త్రిముఖ పోటీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 11,974 ఓట్లతో గెలిచారు. రెండో స్థానంలో తెదేపా, మూడో స్థానంలో సీపీఐ, నాలుగో స్థానంలో తెరాస నిలిచాయి.


రేసు రసవత్తరం (ఖమ్మం)

2014 సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనూహ్యంగా మారిపోయిన విషయాలు తెలిసినవే. ఫలితంగా తెరాస ఉభయ జిల్లాల్లో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. భాజపా, సీపీఎం తదితర పార్టీలు కూడా పోటీలో నిలుస్తున్నాయి. రెండు సార్లు తెదేపా అభ్యర్థిగా పోటీ నిలిచిన నామా నాగేశ్వరరావు తాజాగా తెరాసలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్‌, సీపీఎం, భాజపా తదితర పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపు దిశగా అడుగులు వేయాలని, మంచి మెజారిటీతో తెరాస అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లతో ప్రచారం చేయించేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్‌తో ఒక బహిరంగ సభ నిర్వహించడంతోపాటు కేటీఆర్‌తో రోడ్‌షో, బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్‌ కూడా అంతర్గత సమావేశాలు, సమాలోచనలకు తెరతీస్తోంది. గెలుపు దిశగా అడుగులు వేయడానికి వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రచారం ముమ్మరం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. సీపీఎం అభ్యర్థి వెంకట్‌ నామినేషన్‌కు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి రావడంతో తదుపరి ప్రచారానికి తెరతీసేందుకు సీపీఎం ప్రణాళికలు రూపొందించుకుంటోంది. భాజపా కూడా అగ్రనేతలను రప్పించి ప్రచారం చేయాలని భావిస్తోంది.