ఆదివాస గ్రామాలకు చెలమ నీరే గతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆదివాస గ్రామాలకు చెలమ నీరే గతి

రాజమండ్రి,  ఏప్రిల్ 20, (way2newstv.com)
మన్యం ప్రాంతంలో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది. ఆదివాసీ గ్రామాల్లో నేటికీ చెలమనీరే గతిగా వుంది. చింతూరు, వి.ఆర్ పురం, ఎటపాక, కూనవరం మండలాల్లోని అనేక గ్రామాలకు చెంతనే గోదావరి నది ప్రవహిస్తుంది. నది చెంతనే ఉన్నప్పటికీ రక్షిత మంచినీటి సదుపాయాన్ని అధికార యంత్రాంగం కల్పించలేకపోయింది. ఏటికేడాది వేసవి సమయంలో మన్యం ప్రజల కష్టాలు రెట్టింపవుతూనే ఉన్నాయిపోలవరం ముంపు మండలాల్లో తాగునీటి పధకాలు మూలనపడ్డాయి..వేసవికి ముందే తాగునీటి కొరత తలెత్తింది. గోదావరి చెంతనే వున్న పోలవరం ముంపు మండలాల్లో తాగునీటి సమస్య మరింత జఠిలంగా వుంది.. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల ద్వారా కోట్ల నిధులు ఖర్చు పెట్టిన వైనం కాస్తా నిరుపయోగంగానే మారింది. ఏటికేడాది తాగునీటి సమస్యలు జఠిలంగా మారుతున్నా పట్టించుకుంటోన్న పరిస్థితి కన్పించడంలేదు. . ఏటా కోట్లు ఖర్చు పెడుతున్నా గిరిజనానికి రక్షిత మంచినీరు దక్కలేదు. వేసవిలో మంచినీటికి చెలమనీరే దిక్కు. తూర్పు మన్యంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా వుంది. ముంపు మండలాల్లో మంచినీటి తీవ్ర కటకటలాడుతున్నారు. 


ఆదివాస గ్రామాలకు చెలమ నీరే గతి

చింతూరు, రంపచోడవరం ఐటిడిఎ పరిధిలోని ఆర్ డబ్ల్యుఎస్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 528 రక్షిత మంచినీటి పథకాలున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 514 తాగునీటి బోర్లు వున్నాయి. వీటిలో సగానికిపైగా గిరిజనులకు ఉపయోగపడటంలేదు. చింతూరు, ఎటపాక, కూవనం, వి ఆర్ పురం మండలాల్లో 126 మంచినీటి పథకాలు మూలనపడ్డాయి. దీంతో వేసవి ప్రారంభంలోనే గిరిజనులకు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు తుప్పుపట్టిపోయాయి. మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. కుగ్రామాల్లో చెలమ నీటితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కూనవరంలో 50వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఈ గ్రామంలో సుమారు ఐదు వేల మంది తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. సమీపంలోని చెలమల నీరు తాగాల్సిన దుస్థితి దాపురించింది. రంపచోడవరం మండలం గాంధీనగరం గ్రామంలో రూ.10 కోట్ల వ్యయంతో 22 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్ధేశించిన నీటి పథకం ఐదేళ్ల క్రితం చేపట్టినా ఇప్పటికీ పూర్తిచేయలేకపోయారు. ఈ పథకం పూర్తికాకపోవడంతో కాకవాడ, వేములకొండ, షోకులగూడెం, చెరుపూరు తదితర అనేక గ్రామాల ప్రజలకు తాగునీరు అందడంలేదు. ఈ మండలంలోని బోసిగూడెం, మడిచెర, వాడపల్లి వంటి మారుమూల గ్రామాల ఆదివాసీలు చలమల నీరే తాగుతున్నారు. వై రామవరం మండలం బురదకోట, రాములకొండ, కప్పలబండ, మడుగుతోట, మనగలపూడి, బూరుగువాడ, జాజిగడ్డ గ్రామాల్లో చేతిపంపులు పని చేయకపోవడంతో ఈ గ్రామస్థులు వాగునీరు తాగుతున్నారు. ఎండలు ముదురుతుండటంతో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. బావుల్లో నీటి మట్టం అడుగంటింది. భూగర్భ జలాల మట్టం లోతుకుపోవడంతో చేతిపంపులు పనిచేయడంలేదు.