పాలమూరుకు కర్నాటక జలాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాలమూరుకు కర్నాటక జలాలు

ఫలించిన కేసీఆర్ దౌత్యం
హైదరాబాద్, మే,03, (way2newstv.com):
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవి ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణ పూర్ రిర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 


పాలమూరుకు కర్నాటక జలాలు

మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ అభ్యర్ధించారు. కేసిఆర్ అభ్యర్ధనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసిఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు.