రైతులకు ఆసరాగా రైతు బంధు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులకు ఆసరాగా రైతు బంధు


హైద్రాబాద్, మే 28, (way2newstv.com)
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు బంధు పథకం  తీసుకొచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి చెక్కుల ద్వారా ఎకరానికి 2 పంటలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడమే  రైతు బంధు పథకం వెనుకున్న ప్రధాన లక్ష్యం. రైతు బంధు పథకం గురించి మరింత సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనుంది. రైతు బంధు పథకం కోసం వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్, రాష్ట్ర సమాచార శాఖ అధికారుల అధ్యక్షతన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. 8 బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రైతులకు చెక్కులను పంపిణీ చేయనుంది. రూ. 50 వేల లోపు వారికి సింగిల్ చెక్కు ఇవ్వనుండగా.. అంతకన్నా ఎక్కువ మొత్తం వున్న వారికి రెండు చెక్కులు జారీ చేసే విధంగా విధివిధానాలు రూపొందించారు. పట్టాదారులకే నేరుగా చెక్కులు పంపిణీ చేయనుండగా అందుకు సంబంధించిన వివరాలను సంబంధిత విభాగం అధికారులు ఎప్పటికప్పుడు ప్రతీ రోజు వెబ్‌సైట్‌లో సంక్షిప్తం చేయనున్నారు. చెక్కుల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా చెక్కులపై పట్టాదారు పేరు, పట్టాదారు పాస్‌బుక్ నెంబర్, ఆధార్ నెంబర్, వారి వయస్సు, రెవెన్యూ విలేజ్, మండలం, జిల్లా, ఆర్థిక సహాయం మొత్తం, కమిషనర్, డైరెక్టర్ స్పెసిమన్ సంతకం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఉండనున్నాయి. 


రైతులకు ఆసరాగా రైతు బంధు

చెక్కులపై రైతు బంధు పథకం పేరును కూడా ముద్రించనుండటంతో చెక్కులు పక్కదారి పట్టే అవకాశం కూడా లేదు. చెక్కు చెల్లుబాటు కాలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. ఆలోగా చెక్కుని నగదుగా మార్చుకోలేకపోతే, ఆ తర్వాత మళ్లీ కొత్త చెక్కు తీసుకోవాల్సి ఉంటుంది. డీఏఓలు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు, సహకార శాఖ, ఆర్డీవోలు, ఏడీయేలు పర్యవేక్షణలో చెక్కుల పంపిణీ జరగనుంది.పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని మే 10వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లాలో చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి రైతు బంధు పథకాన్ని ప్రారంభిస్తారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని పంపిణీ చేశారు. పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనున్న చెక్కుల పంపిణీకి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రెవెన్యూశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 58.33 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు 1.43 కోట్ల ఎకరాలకు 58.98 లక్షల చెక్కులను వ్యవసాయశాఖకు బ్యాంకులు అప్పగించాయి. వీటిలో చివర విడతగా 2.20 లక్షల చెక్కులు సాయంత్రం ముంబయి నుంచి ప్రత్యేక కార్గో విమానంలో రాగా, వీటిని వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలకు పంపించారు. ‘రైతుబంధు’ పథకం కింద పంపిణీ చేయనున్న చెక్కుల విలువ రూ. 5,730.80 కోట్లు. దీనికి సంబంధించి ఇప్పటికే 8 బ్యాంకుల్లో వ్యవసాయ కమిషనర్‌ రూ. 5,785 కోట్లను జమచేశారు. జారీచేసిన చెక్కుల విలువకన్నా ఎక్కువ మొత్తాన్నే బ్యాంకుల్లో జమ చేసినందున నగదు తీసుకోడానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యవసాయశాఖ భావిస్తోంది.