ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వైపు పాలనపై మరో వైపు పొరుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఏపీ, మహారాష్ట్రలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పెంపొందించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అటు కేంద్రంతోనూ స్నేహపూర్వక మైత్రి కొనసాగిస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెంపొందించుకోవాలని చూస్తున్నారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర సహకారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారం అందించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ను పిలిచేందుకు స్వయంగా కేసీఆర్ మహరాష్ట్ర వెళ్లనున్నారు. ఇక మరోవైపు మరో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ ప్రభుత్వంతో కూడా కేసీఆర్ సఖ్యత కొనసాగిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాలతో సంబంధాలపై కేసీఆర్ దృష్టి
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో నది జలాలు, ఉద్యోగుల విభజన, బిల్డింగ్ల అప్పగింతపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగాయి. అయితే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో స్నేహ మైత్రి చిగురించింది. కేసీఆర్ దౌత్యంతో హైదరాబాద్లోని సెక్రటేరియట్, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ తెలంగాణకు అప్పగించేందుకు ఇప్పటికే జగన్ అంగీకారం తెలిపారు. ఇక పూర్తి స్థాయిలో ఉద్యోగుల విభజనతో పాటు 9,10 షెడ్యూల్ సమస్యలను పరిష్కరించుకునేందుకు సైతం ఈ మైత్రి ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే నది జలాల వినియోగంపై కూడా చర్చలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ను స్వయంగా ఏపీ వెళ్లి ఆహ్వానించనున్నారు కేసీఆర్. ఈ పర్యటనలో పలు అంశాలపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంతో కూడా స్నేహపూర్వక మైత్రి కొనసాగిస్తున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీకి వెళ్లి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు. మొత్తానికి అటు పాలన పరమైన అంశాలు ఇటు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో మైత్రిని కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్
Tags:
telangananews