గంటా అప్పుడే స్వరం పెంచారా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గంటా అప్పుడే స్వరం పెంచారా


విశాఖపట్టణం, జూన్ 7 (way2newstv.com)
విశాఖ అర్బన్ జిల్లా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా గొంతు పెద్దది చేస్తున్నారు. పార్టీ ఘోరమైన ఓటమితో ఓ వైపు సతమవుతూంటే ఈ మాజీ మంత్రి గారు మాత్రం జగన్ సర్కార్ పై అపుడే యుధ్ధం ప్రకటించేశారు. ఇంకా కొత్త ప్రభుత్వం కుదురుకోకుండానే దాడి మొదలెట్టేశారు. హామీలను జగన్ మరచిపోయాడని, ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్నాడని, ప్రతిపక్షాన్ని బెదిరిస్తున్నారని, మీడియాను సైతం వదలడం లేదని ఇలా గంటా బాగానే నోరు చేసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ జమానాలో ఏడేళ్ళ పాటు నిరాటంకంగా మంత్రి పదవిని చేపట్టిన గంటాకు ఇపుదు ఏం తోచడంలేదుగా ఉంది, కనీస వ్యవధి కూడా ఇవ్వకుండానే జగన్ మీద బాణాలు వేస్తున్నారని అంటున్నారు.


గంటా అప్పుడే స్వరం పెంచారా
ఇక మాజీ మంత్రి గంటా రాజకీయ జీవితం చూస్తే ఆయన పదవి కోసం చేసిన గోడ దూకుళ్ళెన్నో కనిపిస్తాయి. అప్పట్లోనే నాలుగు పార్టీలు మారిన గంటా ఈసారి కూడా వైసీపీలోకి రావాలని చూసినా కుదరలేదంటారు. దాంతో తప్పనిసరిగా ఆయన టీడీపీ నుంచి పోటీకి దిగి అతి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఇక టీడీపీకి మొత్తంగా 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి, నోరున్న నేతలు పెద్దగా లేకపోవడంతో గంటా తన షోను మొదలెట్టారని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి తప్పకుండా దక్కుతుంది. ఇది క్యాబినెట్ ర్యాంక్ పదవి కావడంతో గంటా దీని మీద కన్నేశారని అంటున్నారు.ఉత్తరాంధ్రలో గెలిచింది అచ్చంగా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. ఇందులో విశాఖ సిటీ నుంచే నలుగురు గెలిచారు. దాంతో గంటా తన ప్రయారిటీని పార్టీలో గట్టిగా కోరుకుంటున్నారని అంటున్నారు. అదే విధంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఆర్ధికంగా బలవంతుడు కావడంతో గంటా చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎటూ ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు ఉన్నారు, ఉప నాయకులుగా అచ్చెన్నాయుడుతో పాటు మరోకరికి చాన్స్ ఉంటుంది. దీంతో పీఏసీ చైర్మన్ పదవిని తాను తీసుకోవాలని గంటా చూస్తున్నారని చెబుతున్నారు. అదే జరిగితే బుగ్గ కారుతో మళ్ళీ హవా చలాయించవచ్చునన్నది మాజీ మంత్రి గారి కల. మరి అది నెరవేరుతుందా.