తిరుపతి, జూన్ 26, (way2newstv.com)
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 2న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
జూలై 4న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు.
జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. జూలై 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్ కొనుగోలు చేసి ఊంజల్సేవలో పాల్గొనవచ్చు. జూలై 16న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు. జూలై 28 నుండి 30వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.