విజయవాడ జూలై 23 (way2newstv.com):
ఆంధ్రప్రదేశ్లో ఇకపై రేషన్ బియ్యంగా సన్న బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎటువంటి అవినీతి జరగకూడదనే ఉద్ధేశ్యంతో 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీల బ్యాగుల ద్వారా రేషన్ బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బియ్యంతోపాటు ఐదారు రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ సన్న బియ్యం బ్యాగులను ప్రభుత్వం అందజేయనుంది. అర్హులు రేషన్ షాపుల వద్ద బారులు తీరే అవసరం లేకుండా, గ్రామవలంటీర్ల ద్వారా ఇంటింటికీ వీటిని ప్రభుత్వమే డోర్ డెలివరీ చేయించనుంది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏపి సన్న బియ్యం
రేషన్ డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు కుమ్మక్కై సరుకులను ఇవ్వడంలో అవినీతి చేస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు ఉండగా.. రేషన్ డీలర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు బియ్యాన్ని ఇకపై ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుతం రేషన్ డీలర్లకు బియ్యం 50 కిలోల చొప్పున బస్తాల్లో పౌర సరఫరాలశాఖ సరఫరా చేస్తుంది. పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడ నుంచి రేషన్ దుకాణాలకు వీటిని పంపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇకపై బియ్యాన్ని 5, 10, 20 కిలోల ప్యాకెట్లు చౌక డిపోలకు పంపిణీ చేస్తారు. రేషన్ డీలర్లు స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్లుగా మారనుండగా.. వారి నుంచి వాలంటీర్లు వాటిని తీసుకుని వెళ్లి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. కుటుంబంలో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా.. కుటుంబంలో సభ్యులను బట్టి 5, 10, 20 కిలోల ప్యాకెట్లను ఇవ్వనున్నారు.
Tags:
Andrapradeshnews