చంద్రుడిపై ఇక ఊపందుకొన్న ప్రయోగాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రుడిపై ఇక ఊపందుకొన్న ప్రయోగాలు

న్యూఢిల్లీ జూలై 23 (way2newstv.com)
భారత్ చేపట్టిన ‘చంద్రయాన్-2’ ప్రయోగంతో చంద్రుడిపై పరిశోధనలు మరోసారి ఊపందుకున్నాయి. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3ఎం1 రాకెట్ చంద్రయాన్-2ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 7వ తేదీన ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా దిగనుంది. ఈ ప్రయోగంపై ఇస్రోను ప్రశంసించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారమే మరింత ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించింది. 2024లో చందమామపైకి తొలి మహిళను పంపనున్నట్లు ప్రకటించి సంచలనం రేపింది.
చంద్రుడిపై ఇక ఊపందుకొన్న ప్రయోగాలు

తొలిసారి చంద్రుడిపైకి మనిషిని పంపి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరో సంచలన ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు నాసా ప్రకటించింది. 2024లో తొలిసారిగా ఓ మహిళ, పురుషుడిని పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం 30 బిలియన్ డాలర్లు వెచ్చించనున్న నాసా దీనికి ‘ఆర్టెమిస్ లునార్ ప్రోగ్రాం’గా నామకరణం చేసింది. అర్టెమిస్ అనే గ్రీకు దేవత పేరు. అపోలో కవల సోదరి. 1960లో చంద్రుడిపైకి తొలిసారి మనిషిని తీసుకెళ్లిన ల్యాండర్ పేరు అపోలో. ఇప్పుడు తాజా ప్రాజెక్టుకు అతడి సోదరి ‘అర్టెమిస్’ పేరు పెట్టడం విశేషం. ‘అర్టెమిస్’ను వేటగాళ్లు ఆరాధ్య దైవంగా భావిస్తారు. 2028కల్లా చంద్రుడిపై మనిషి స్థిరమైన ఉనికి చాటాలన్నదే తమ లక్ష్యమని, అమెరికా సంస్థలతో పాటు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు. ‘అర్టెమిస్’ ప్రాజెక్టు కోసం కెనడీ స్పేస్ సెంటర్‌లో తమ సైంటిస్టులు, ఇంజినీర్లు ఇప్పటికే పని మొదలు పెట్టారని వెల్లడించారు. చందమామ ఉపరితలంపై నీరు, మంచు వంటి సహజ వనరుల ఉనికిని తెలుసుకోవడానికి, అంగరాకుడిపై మరిన్ని పరిశోధనలకు ఈ ప్రాజెక్టు దారి చూపుతుందని నాసా చెబుతోంది