ఆచితూచి వ్యవహరించే పనిలో బాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆచితూచి వ్యవహరించే పనిలో బాబు

విజయవాడ, జూలై 13, (way2newstv.com)
ఏపీలో అధికారాన్ని తిరిగి సంపాయించాలి. చిన్నబాబు లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చూసి త‌రించాలి. మ‌రో 20 ఏళ్లపాటు టీడీపీనే అధికారంలో ఉండాలి! ఇవీ.. టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్రబాబునాయుడు ప‌క్కా వ్యూహాలు. అయితే, తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ వ్యూహాలు తలకిందులు అయ్యాయి. వంగి వంగి పెట్టిన ద‌ండాలు మ‌ట్టి కొట్టుకు పోయాయి. ఊహించ‌ని రీతిలో ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. గెలిచిన 23 స్థానాల్లోనూ ఒక్క కుప్పం మిన‌హా మిగిలిన చోట్ల చావు త‌ప్పిన ప‌రిస్థితి ఎదురైంది. మ‌రి ఇంత‌గా ప్రజ‌లు త‌మ‌కు ఎందుకు ఓడించారు? ఊహించ‌ని ఈ ప‌రిస్తితి ఎలా ఎదురైంది? గ‌త కొన్నాళ్లుగా టీడీపీని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి.
ఆచితూచి వ్యవహరించే  పనిలో బాబు

ఇప్పటికే ప‌లుమార్లు.. ఓట‌మిపై స‌మీక్షలు చేప‌ట్టినప్పటికీ.. చంద్రబాబునాయుడుకు ఎందుకు ఓడిపోయామా? అనే సందేహానికి స‌మాధానం ల‌భించ‌లేదు. ఆయ‌నే స్వయంగా ఈ విష‌యాన్ని “ప్రజ‌ల‌కు ఎన్నో ఎన్నెన్నో చేశాం. మ‌హిళ‌ల‌కు కానుక‌లు ఇచ్చాం. ప్రతి ఒక్క సామాజిక వ‌ర్గానికి కూడా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి నిధులు అందించాం. అభివృద్ధి ప‌రుగులు పెట్టించాం. ఎవ‌రు ఏమ‌డిగినా ఇచ్చాం. అయినా ఎందుకు ఓట్లు ప‌డ‌లేదు.? ఎందుకు ఓడిపోయాం?“- అని పెద్ద ఎత్తున ఆయన ఆవేద‌న వ్యక్తం చేశారు. నిజ‌మే! క్షేత్రస్థాయిలో ప‌ర్యవేక్షణ క‌రువైన‌ప్పుడు.. మందీ మార్బలం చెబుతున్నదే నిజ‌మ‌ని న‌మ్మిన‌ప్పుడు ఎవ‌రికైనా.. ఏ పార్టీ వారికైనా.. ఇలానే అనిపిస్తుందికానీ, ఇప్పుడు జిల్లాల వారిగా త‌న ద‌గ్గర‌కు వ‌స్తున్న పంచాయితీల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత‌.. టీడీపీ ఓట‌మికి గ‌ల కార‌ణా లు ఇవా? అని నోరెళ్ల బెడుతున్నార‌ట చంద్రబాబునాయుడు. ప‌లు జిల్లాల్లో అసంతృప్తుల‌ను బుజ్జగించే ప‌నిచేయ‌లేదు చంద్రబాబు. ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగుల‌ను సైతం ప‌క్కన పెట్టకుండా వారినే భుజాన ఎత్తుకున్నారు. స‌ర్వేల పేరుతో అంకెల‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప.. క్షేత్రస్థాయిలో ప్రజ‌ల నాడిని, సీనియ‌ర్ల మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. అంతేకాదు, వివిధ పార్టీల నుంచి వ‌చ్చిన వారిని చేర్చుకుని, టికెట్లు ఇచ్చారు త‌ప్పితే.. వారి వ్యవ‌హార శైలిపై దృష్టి పెట్టలేకపోయారు.ఎన్నిక‌ల‌కు ముందు ప్రతి రోజు ఉద‌యం గంటసేపు టెలీకాన్ఫరెన్స్‌ల‌తో మునిగిపోయిన చంద్రబాబునాయుడు ప‌దే ప‌దే పార్టీ, ప్రభుత్వంపై 80 శాతం సంతృప్తి ఉంద‌ని చెప్పుకోవ‌డ‌మే త‌ప్పా వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేక‌త‌తో పాటు… ఎమ్మెల్యేల‌కు కార్యక‌ర్తల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్ పూడ్చడంపై దృష్టి పెట్టలేదు. ఫ‌లితంగా ఎక్కడిక‌క్కడ పార్టీలో అంత‌ర్గత క‌ల‌హాలు, అసంతృప్తులు పెరిగిపోయి.. పార్టీ ఏమైనా ఫ‌ర్వాలేదు.. అనే ధోర‌ణి వ‌చ్చింది. దీనివ‌ల్లే పార్టీ అధికారంలో నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఇప్పుడు చంద్రబాబుకు క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. మ‌రి దీనికి బాబు విరుగుడు మంత్రం ఎలా ఉంటుందో చూడాలి.