వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి ప్రకటనలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి ప్రకటనలు

విజయవాడ, జూలై 27  (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. షెడ్యూలు ప్రకారం జులై 22న విడుదలకావాల్సిన నోటిఫికేషన్లను జులై 26న అధికారులు విడుదల చేశారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జులై 27 నుంచి ఆగస్టు 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,589 పోస్టులను ప్రభుత్వం భర్తీచేయనున్నారు. వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా ఎంపిక కమిటీల(డీఎస్సీ) ద్వారా గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి ప్రకటనలు

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజి ఇవ్వనున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో సెప్టెంబరు మొదటి వారంలో జరుగుతుంది. సెప్టెంబరు మూడో వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. అదే నెల నాలుగోవారంలో నియామకపత్రాలు అందజేస్తారు. 
గ్రామ సచివాలయ పోస్టులు, అర్హతల వివరాలు.. 
గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టులు: పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఏఎన్‌ఎం, వెటర్నరీ/ ఫిషరీస్ అసిస్టెంట్, మహిళా పోలీసు & ఉమెన్-చైల్డ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టికల్చర్ ఎంపీఈవో, డిజిటల్‌ అసిస్టెంట్, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్. 
వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టులు: కార్యదర్శి, మౌలిక వసతుల కార్యదర్శి, శానిటేషన్ కార్యదర్శి, విద్యా కార్యదర్శి, ప్రణాళిక కార్యదర్శి , వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శి, ఇంధన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి. 
వార్డు సచివాలయ పోస్టులు, అర్హతల వివరాలు.. 
స్టైఫండ్ రూ.15 వేలు.. 
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు. నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి డీడీఓ (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌)గా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది.