గిడ్డి ఈశ్వరీ దారెటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గిడ్డి ఈశ్వరీ దారెటు

విశాఖపట్టణం, జూలై 29, (way2newstv.com)
వైసీపీ లో ఉండ‌గా కంచుకంఠంతో అధికార ప‌క్షంపై ఫైర్ బ్రాండ్‌గా విరుచుకుప‌డి రాష్ట్ర ప్రజ‌ల దృష్టిని ఆక‌ర్షించిన మ‌హిళా నాయ‌కురాలు గిడ్డి ఈశ్వరీ. ముఖ్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అంత‌టి నాయ‌కుడిని… త‌ల న‌ర‌కుతా! అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసి.. ఓవ‌ర్ నైట్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టించింది. అయితే, ఒకే ఒక్క త‌ప్పట‌డుగు ఆమె రాజ‌కీయ భ‌విత వ్యాన్ని చింద‌ర వంద‌ర చేసేసింది. ఆమే.. గిడ్డి ఈశ్వరి. విశాఖ జిల్లా పాడేరు నుంచి 2014లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన గిడ్డి.. జ‌గ‌న్‌కు చాలా స‌న్నిహితులైన నాయ‌కుల్లో ఒక‌రుగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న కుటుంబంతోను క‌లిసిపోయారు. జ‌గ‌న‌న్న మాటే వేదంగా ముందుకు న‌డిచి దాదాపు 28 వేల భారీ మెజారిటీతో విజ‌యం కైవ‌సం చేసుకున్నారు.
గిడ్డి ఈశ్వరీ దారెటు

అయితే, త‌ర్వాత కాలంలో చంద్రబాబు చేప‌ట్టిన ఆక‌ర్ష్ వ‌ల‌లో ప‌డిన గిడ్డి ఈశ్వరి మంత్రి ప‌ద‌విపై మోజు, ఎస్టీ క‌మిష‌న్ చైర్ ప‌ర్సన్ ప‌ద‌విపై మ‌మ‌కారంతో వైసీపీకి బై చెప్పి టీడీపీలోకి చేరుకున్నారు. అనంత‌రం, ఆమె జ‌గ‌న్‌పై నా విమ‌ర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేద‌ని, జ‌గ‌న్ పాద‌యాత్ర కాదు.. మార్నింగ్ వాక్ అంటూ.. టీడీపీ నేత‌ల‌తో క‌లిసి ప్రెస్‌మీట్‌లు పెట్టి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి ఆమె టీడీపీ టికెట్‌పై పాడేరు నుంచి పోటీ చేశారు. తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ముందు ఆమె కూడా ఓడిపోయారు. అంతేకాదు, పార్టీ మార‌డాన్ని , జ‌గ‌న్‌ను తిట్టడాన్ని కూడా పాడేరు గిరిజ‌నులు స‌హించ‌లేక పోయారు.ఈ క్రమంలో గిడ్డి ఈశ్వరిని ఇక్కడి ప్రజ‌లు చిత్తుగా ఓడించారు. ఇక‌, ఇప్పుడు ఆమె ఇంటి గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. త‌న‌కు ఎంతో ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని భావించిన టీడీపీ నామ‌మాత్ర‌పు సీట్లతో ప్రతిప‌క్షానికి ప‌రిమితం కావడం, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పార్టీ కోలుకునే ప‌రిస్థితి లేద‌ని సంకేతాలు రావ‌డంతో ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై ఆమె త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. అస‌లు టీడీపీలో ఆమెను ప‌ట్టించుకునే వాళ్లే లేర‌ట‌.ఇక బ‌య‌ట‌కు వ‌చ్చినా పాడేరు టీడీపీలో క‌నీసం గిడ్డి ఈశ్వరిని ప‌ల‌క‌రించే నాయ‌కుడే లేడ‌ట‌. పాడేరులో ముందు నుంచి టీడీపీ చాలా వీక్‌గా ఉంది. ఈ క్రమంలో గిడ్డి ఈశ్వరిఅక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్నా పార్టీని సేవ్ చేస్తార‌న్న న‌మ్మకం ఆమెకే లేద‌ట‌. అదే వైసీపీలో ఉండి, ఓ రెండు సంవ‌త్సరాలు ఓర్చుకుని ఉంటే.. జ‌గ‌న్ మంచి పొజిష‌న్ ఇచ్చి ఉండేవార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎం స‌హా మంత్రి ప‌ద‌విని కూడా ఆమెకే క‌ట్టబెట్టేవారు. అయితే, క్షణికావేశంలో చేసిన ఒకే ఒక త‌ప్పు.. ఇప్పుడు వైసీపీకి దూరమైపోవ‌డంతోపాటు టీడీపీ కేడ‌ర్‌కు, నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు చేరువ కాలేక నానా తిప్పలు ప‌డుతున్నారు. మ‌రి ఈశ్వరికి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఉంటుందా ? ఇక్కడితో ఎండ్ కార్డేనా ? అన్నది చూడాలి.