కోరిన కోర్కెలు తీర్చే జగనన్నా : జనసేన ఎమ్మెల్యే పొగడ్తలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోరిన కోర్కెలు తీర్చే జగనన్నా : జనసేన ఎమ్మెల్యే పొగడ్తలు

విజయవాడ, జూలై 17, (way2newstv.com)
ఏపీ అసెంబ్లీలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈ బడ్జెట్‌‌పై స్పందించిన జనసేన.. అభివృద్దికి, సంక్షేమానికి మధ్య సమతుల్యత కొరవడిందని అభిప్రాయపడింది. ఓవరాల్‌గా బడ్జెట్‌ చూస్తే ఆదాయం, వ్యయాల మధ్య భారీగా తేడా కనబడుతోందని తెలిపింది. జనసేన ఇలా తమ స్టాండ్‌ను చెబితే.. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. జనసేన ఎమ్మెల్యే రాపాక తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. 
కోరిన కోర్కెలు తీర్చే జగనన్నా : జనసేన ఎమ్మెల్యే పొగడ్తలు

వరప్రసాద్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు వైసీపీ ఎమ్మెల్యేలు బల్లలపై కొడుతూ హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరెడ్డితో జగన్‌ను పొలుస్తూ.. మత్స్యకారుల విషయంలో ప్రస్తానవ వచ్చినప్పుడు జగన్‌ను దేవుడితో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంగా మారింది. రాపాక తన ప్రసంగంలో ‘వైసీపీ తమ మేనిఫెస్టోను దైవ గ్రంథంతో పోల్చడం విన్నాం.. ఒకటో పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ప్రజా సంక్షేమం, అభివ్రుద్ధి కార్యక్రమాలే ఉన్నాయి. ఏ ఉద్దేశంతో భగవద్గీతతో పోల్చారో కాని బడ్జెట్‌లో చాలా పారదర్శకత ఉంది.. మా అధినేత పవన్ అధికారపక్షం మాట్లాడిన వెంటనే వ్యతిరేకించమని చెప్పలేదు.. ప్రజలకు ఉపయోగపడుతుంటే మద్దతు తెలపమని చెప్పారు. ప్రభుత్వం ప్రజల కోసం చేసే కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. బడ్జెట్‌లో ప్రతి పేజీలోనూ అన్ని వర్గాలను సమ దృష్టితో చూస్తూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపిస్తామని చెప్పారు’ ‘వ్యవసాయ బడ్జెట్ రూ.28వేల కోట్లతో శుభపరిణామం.. రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం వైఎస్సార్ అయితే.. ఇవాళ మళ్లీ అదే దారిలో జగన్ మళ్లీ రైతుల కోసం 28వేల కోట్లతో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాలు రైతుల్ని పట్టించుకున్న పాపానపోలేదు.. కానీ వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అని పరిస్థితి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. మళ్లీ రైతు సంక్షేమం కోసం కట్టుబడింది వైసీపీ మాత్రమే. రైతు భరోసా ప్రవేశపెట్టి.. పంట నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నవాళ్లకు రూ.7లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం’అన్నారు. ‘కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కౌలు ఒప్పంద పత్రాన్ని ప్రవేశ పెడతామని జగన్ గారు చెప్పడం హర్షణీయం. మేము కోరికలు కోరుకుంటే తీర్చేది గంగమ్మ తల్లి అయితే.. కోరకుండా కోరికలు తీర్చింది జగన్‌గారు అని మత్స్యకారులు ఆనందిస్తున్నారు. వాళ్లకు పది లక్షలు సాయం చేస్తామనడం సంతోషం. ఇక దళితులకు నామినేటెడ్ పదవులు ఇస్తాననడం అభినందిస్తున్నా.. ఆనాడు రాజశేఖర్‌రెడ్డి ముందుచూపుతో ఇక 108,104లను తీసుకొచ్చారు. వాటి మూలాన ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతోంది. మళ్లీ వాటికి ప్రాణం పోయాలి. ఇలా బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. మీరు బడ్జెట్‌ను అమలు చేయకపోతే మేము ఆ పొజిషన్‌కు వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రజల్ని విస్మరిస్తే.. సీట్లు మారాల్సి వస్తుంది స్టాండర్డ్‌గా సీటు ఉండాలంటే మంచి చేయాలి’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.