ముంబై, జూలై 24 (way2newstv.com):
దేశంలో కురగాయల ధరలు మండిపోతున్నాయి. మరీముఖ్యంగా టమోటా ధరలు కొండెక్కాయి. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి టమోటాలు. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో కేజీ టమోటా ధర ఏకంగా రూ.80 వరకు కూడా చేరింది. దేశ రాజధానిలో కిలో టమోటా ధర రూ.60 నుంచి 80 మధ్యలో ఉందని వ్యాపారులు తెలియజేస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ధరలు పెరిగాయని పేర్కొంటున్నారు. భారత్ వంటి దేశాల్లో టమోటా ధరలు వాతావరణ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయన్న విషయం తెలిసిందే.
టమాట మోత మ్రోగుతోంది
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట బాగా దెబ్బతింది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. వివిధ రాష్ట్రాల్లో వరదల కారణంగా రవాణా వ్యయాలు కూడా పెరిగాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోవడం కూడా టమోటా ధరపై ప్రభావం చూపింది. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర వంటి టమోటా ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల వల్ల పంటపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు టమోటాల ఎగుమతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ధరలు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల టమోటా ధర కేజీకి రూ.50 పైనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టమోటా ధరల పెరుగుదల వల్ల ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయి. క్యారెట్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, కాకర, బీన్స్, బీరకాయ ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు.
Tags:
all india news