భీమవరంలో 1200 కోట్ల ఆక్వా స్కామ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భీమవరంలో 1200 కోట్ల ఆక్వా స్కామ్

ఏలూరు, ఆగస్టు 19 (way2newstv.com)
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ పత్రాలతో ప్రైవేటు బ్యాంకులకు కొందరు సున్నం వేసినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.650 కోట్ల రుణాలు తీసుకుని, వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలెట్టారు. ఈ కుంభకోణంలో భీమవరానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు వినికిడి. బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమవరంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న వారి వివరాలను సైతం గత రెండు రోజులుగా అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఆక్వా రంగంలో పెట్టుబడులకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు నకిలీ పత్రాలతో రుణాలు పొంది బ్యాంకులను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
భీమవరంలో 1200 కోట్ల ఆక్వా స్కామ్

నకిలీ పత్రాలతో ప్రయివేట్ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన మోసగాళ్ల భాగోతం బయటపడటంతో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. ఐడీబీఐ సహా పలు ప్రయివేట్ బ్యాంకులకు పంగనామాలు పెట్టినట్టు తెలుస్తోంది. వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చే లక్ష్యంతో కొన్ని నిబంధలను విధించిన రిజర్వు బ్యాంకు.. బ్యాంకుల మూలధనం నుంచి 15 శాతం మొత్తం రైతులకు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆక్వాను కూడా వ్యవసాయ రంగంలో కలపడంతో అక్రమార్కులకు వరంగా మారింది. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని కొందరు రూ. వందల కోట్లు రుణాలుగా పొందారు. బ్యాంకుల వద్ద పెట్టిన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీలు చేయగా అవి సరైనవి కావని తెలుస్తోంది. ఒక్క, భీమవరంలోని రెండు బ్యాంకుల్లోనే రూ. 370 కోట్లు కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 1200 కోట్లుపైనే బొక్కేశారన్న ఫిర్యాదుతో సీబీఐ, బ్యాంకు ఉన్నతాధికారులు గతంలో ఆయా బ్యాంకు ఖాతాలను తనిఖీ చేపట్టారు. భీమవరానికి చెందిన కొందరు కృష్ణా జిల్లాలోని కొల్లేరు, ఇతర ప్రాంతాల్లోని భూముల పత్రాలు అప్పట్లో బ్యాంకు అధికారులకు అందజేసి మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి రూ. 90 కోట్లు, మరొకరు రూ. 350 కోట్లు, ఇంకొకరు రూ. 300 కోట్ల మేర పలు బ్యాంకు శాఖల నుంచి రుణాలు తీసుకున్న విషయం బయటపడింది. కృష్ణా జిల్లా కొండంగి ప్రాంతానికి చెందిన కొందరు రైతుల పేరున ఈ రుణాలు పొందటం గమనార్హం. అప్పట్లో బాధిత రైతులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ పలువురు ప్రముఖులు మహబూబ్‌నగర్‌లో చెరువులు సాగు చేస్తున్నట్లు చూపి భీమవరంలోని బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి రుణాలు పొందిన వ్యక్తుల్లో వ్యాపార, రాజకీయ ప్రముఖులు అత్యధికంగా ఉన్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినవారు, తాజా ఎన్నికల్లో పలు పార్టీలకు మద్దతుగా నిలిచిన కొందరు ఈ తరహా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. రుణం తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీ కింద ఉంచిన కొద్దిపాటి ఆస్తులను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు పోలీసుల రక్షణ కోరే పనిలో ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి.