బీసీలు, ముస్లింలకు 50 శాతం సీట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీసీలు, ముస్లింలకు 50 శాతం సీట్లు

టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం 
హైద్రాబాద్, ఆగస్టు 8 (way2newstv.com):
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ నాయకులు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి గురువారం మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన నేపథ్యంలో టికేట్ల కేటాయింపుల్లో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 
బీసీలు, ముస్లింలకు 50 శాతం సీట్లు

ముఖ్యంగా పార్టీ విధేయులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలు, ముస్లింలకే 50 శాతం టికెట్లు ఇవ్వనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న ఆయన మున్సిపాలిటీల్లో ఇప్పటి నుంచి విస్తృత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బీసీ జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు ప్రకటించాలని పీసీసీ చీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నిర్వహించిన ఇంటింటికీ కాంగ్రెస్, వాడవాడలా జెండా కార్యక్రమం విజయవంతమైందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, చల్లా వంశీచంద్ రెడ్డి, సలీమ్ అహ్మద్‌లతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.