క్రియా శీలకంగా మారుతున్న గవర్నర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్రియా శీలకంగా మారుతున్న గవర్నర్

విజయవాడ, ఆగస్టు 20, (way2newstv.com)
గవర్నర్ అంటేనే ప్రధమ పౌరుడు. ఆయన విధులు బాధ్యతలు కేంద్రానికి జవాబుదారిగా ఉండాలి. ఏపీకి అయిదేళ్ళుగా ఖాళీగా ఉంచిన గవర్నర్ పదవిని ఒక్కసారిగా బీజేపీ భర్తీ చేసినపుడే ఆంధ్ర మీద ప్రత్యేక అభిమానం ఉందని అర్ధమైపోయింది. అది కూడా ఏరీ కోరీ ఒడిషాకు చెందిన కరడు కట్టిన బీజేపీవాది హరిచందన్ విశ్వభూషణ్ ను తీసుకువచ్చి గవర్నర్ గా నియమించేసారు. ఆయన వయసు ఎనభై అయిదేళ్ళు కానీ హుషార్ మాత్రం ఎక్కడా తగ్గడమేలేదు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి నెల కూడా కాకుండానే తన మార్క్ అన్నింటా చూపిస్తున్నారు. విశాఖలో మూడు రోజులు పర్యటన చేసిన గవర్నర్ అన్ని సమీక్షించి వెళ్లారు. ఇక రాజధాని నగరంలో కూడా ఆయన ఎక్కడా ఖాళీగా ఉండడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేయడం, ర‌క్త దాన శిబిరాల్లో పాల్గొనడంతో పాటు, స్వచ్చంద సేవా సంస్థలతో కలసి అవగాహన కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు.
క్రియా శీలకంగా మారుతున్న గవర్నర్

ఇదిలా ఉండగా ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీతో పాటు, ఇతర నేతలను కలసి వచ్చిన గవర్నర్ మరింత క్రియాశీలంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఏపీలో కృష్ణా, గోదావరి వరదల సందర్భంగా ఆయన ఏరియల్ సర్వే చేసి అందరికీ ఆశ్చర్యచకితులను చేశారు. సాధారణంగా గవర్నర్లు ఏరియల్ సర్వేలు చేయడం చాలా తక్కువ. ఎక్కడైనా రాష్ట్రపతి పాలన ఉంటే గవర్నర్ బాగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. ప్రజా ప్రభుత్వం ఉన్న చోట అన్ని విషయాలు ముఖ్యమంత్రి ద్వారా తెప్పించుకుంటారు. వారి ద్వారానే అన్నీ తెలుసుకుంటారు. కానీ ఏపీ గవర్నర్ హరిచందన్ ఏరియల్ సర్వే చేయడం అంటే ఆయన ఎంత డైనమిక్ అన్నది అర్ధమవుతుంది.ఏపీలో ఈ నెలలో రెండు సార్లు భారీగా వరదలు వచ్చాయి. ఆగస్ట్ నెల మొదటివారంలో గోదావరి జిల్లాలో వరదలు వచ్చాయి. అప్పట్లో జగన్ జెరూసలం టూర్లో ఉన్నారు. రెండవ‌మారు కృష్ణా నది వరదలు సంభవించాయి. ఆ టైంలో జగన్ అమెరికా టూర్లో ఉన్నారు. దీని మీద టీడీపీతో పాటు, బీజేపీ నేతలు ఘాటుగా జగన్ ని విమర్శిస్తున్నారు. ఏపీ వరదల్లో అల్లాడుతూంటే ముఖ్యమంత్రి విదేశాల్లో ఉండడమేంటని మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు, ఇతర నేతలు కామెంట్స్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా దీని మీద సెటైర్లు వేశారు.ఏపీ నిండా మునిగిపోతూంటే జగన్ అమెరికాలో కూర్చున్నారని కన్నా చేసిన విమర్శలు వైసీపీ సర్కార్ ని ఇబ్బంది పెట్టేవే. ఇక కొత్తగా బీజేపీలో చేరిన సుజనా చౌదరి అయితే వరదల విపత్తుని ఎదుర్కొనే విషయంలో వైసీపీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని దారుణమైన మాట అనేశారు. అంతటితో ఆగకుండా ఏపీలో వరదల ప్రభావం గురించి తాము గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని సుజనా అనడం వెనక మతలబు ఏంటో అర్ధం కావడంలేదు. ఏపీలో ప్రజల మద్దతుతో గెలిచిన జగన్ సర్కార్ ఉంది. మరి వరదల విషయంలో నివేదిక ఇవ్వాల్సింది ప్రభుత్వం కదా. అంటే జగన్ సర్కార్ ని పక్కన పెట్టి గవర్నర్ తోనే కధ నడిపిద్దామని బీజేపీ ఏమైనా ఆలోచన చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా యాక్టివ్ గవర్నర్ ఉండడం అంటే పక్కలో బల్లెం ఉన్నట్లే మరి.