ట్రాన్స్ కోకు చెల్లించని పరిహారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్రాన్స్ కోకు చెల్లించని పరిహారం

ముందుకు సాగని పనులు
హైద్రాబాద్, ఆగస్టు 17, (way2newstv.com)
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకం(ఎస్‌ఆర్‌డిపి)కి ట్రాన్స్‌కో, టిఎస్ సిపిడిసిఎల్‌ల సహాయ నిరాకరణతో తీవ్ర జాప్యం చోటు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లైఓవర్లు నిర్మించే ప్రాంతాల్లో ట్రాన్స్‌కోకు చెందిన టవర్లు, టిఎస్ సిపిడిసిఎల్‌కు చెందిన స్తం భాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. టవర్లు, స్తంభాలు తొలగిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. తొలగించని పక్షంలో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్ట్ పనులు స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రాకపోకలుసాగిస్తున్న ప్రజలు నరకయాతను అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో భారీ ఎత్తున ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్లు, స్కైవేల నిర్మాణాన్ని చేపట్టారు. 
ట్రాన్స్ కోకు చెల్లించని పరిహారం

ప్రాజెక్ట్ పనులను ఉపందుకున్న ప్రస్తుత తరుణంలో ట్రాన్స్‌కో సహాయ నిరాకరణ చేస్తోంది. ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్ట్‌లు వచ్చే ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్‌కో టావర్లను మరో చోటికి మార్చేందుకు డెవలప్‌మెంట్ చార్జీలను భారీ మొత్తంలో చెల్లించాలని ట్రాన్స్‌కో పట్టుబడుతుంది. 27.5 శాతం చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో సూపర్ విజన్ చార్జీల పేరిట 25 శాతం, ఇంజనీరింగ్ చార్జీలు 2.5 శాతం చెల్లిస్తేనే పనులు ప్రారంభిస్తామని బల్దియాకు ట్రాన్స్‌కో అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రస్తుతం ఎటు పలుపోని పరిస్థితుల్లో బల్దియా ప్రాజెక్ట్ అధికారులు ఉన్నారు.ప్రతినెల ప్రభుత్వ శాఖల సమన్యయ సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభిస్తుందో బల్దియా, ట్రాన్స్‌కో, టిఎస్ సిపిడిసిఎల్‌ల మధ్య నెలకొన్న సమస్యలే ప్రత్యేక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఉన్నతాధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎస్‌ఆర్‌డిపి పథకాన్ని చేపట్టారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిగ్నల్ రహిత రహదారులే లక్షంగా ఎస్‌ఆర్‌డిపి పథకానికి రూపకల్పన చేశారు. సుమారు రూ.3వేల కోట్ల అంచనాలతో దశలవారీగా ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు.ఎల్.బి.నగర్‌లో రూ.542 కోట్లు, కెబిఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, రోడ్డు నెంబర్ 45, దుర్గం చెరువు, ఓ.యూ కాలనీ, కొత్తగూడ, బహదూర్‌పుర, తదితర జంక్షన్ల దగ్గర పనులు జరుగుతున్నాయి. పనులు చేపట్టాల్సిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, హైటెన్షన్ టవర్లను తొలగిస్తే పనులు ముందుకు సాగుతాయి. అందుకయ్యే ఖర్చును చెల్లిస్తే తొలగిస్తామని రెండు శాఖలు స్పష్టం చేస్తున్నాయి. రెండు సంస్థలు 18 శాతం జిఎస్‌టి చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ పనుల చెల్లింపులో జిఎస్‌టి 12 శాతం ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. 18 శాతం జిఎస్‌టి ఇస్తే నిబంధనలు అంగీకరించవు. 12 శాతం జిఎస్‌టి ఇస్తామంటే రెండు సంస్థలు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో పనులు అగిపోయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.సిపిడిసిఎల్…జిఎస్‌టి 12 శాతం మాత్రమే ఇంజనీరింగ్ పనుల్లో వసూలు చేయాలని ప్రభుత్వం జారీ ఉత్తర్వులను టిఎస్ సిపిడిసిఎల్ అమలు చేయడం లేదు. 18 శాతం జిఎస్‌టి చెల్లిస్తేనే పనులు ప్రారంభిస్తామని టిఎస్ సిపిడిసిఎల్ అధికారులు బల్దియాకు స్పష్టం చేశారు. 18 శాతం జిఎస్‌టి చెల్లిస్తే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు అవుతుంది. అన్ని ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలు 12 శాతం జిఎస్‌టి మాత్రమే వసూలు చేయాలని 4.07.2017న జిఓ 67 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు నెంబర్ 45 నుంచి దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కెబుల్ స్టే బ్రిడ్జి వరకు రూ.80 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. సుమారు 53 పిల్లర్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు హైటెన్షన్ తీగల దగ్గర అగిపోయాయి. 14వ నెంబర్ పిల్లర్ నుంచి 7వ నెంబర్ పిల్లర్ వరకు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. హైటెన్షన్ టవరు తొలగించాలని ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వకముందే బల్దియా ఇంజనీర్లు ట్రాన్స్‌కోకు లేఖ రాశారు. 2017 ఏప్రిల్‌లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు టావర్ల తొలగించేందుకు ఎంత మొత్తంలో చెల్లించాలనే విషయంలో స్పష్టం రాలేదు. రూ.45 కోట్లు ఇవ్వాలని కొరిన ట్రాన్స్‌కో, తరువాత రూ.22.45 కోట్లు ఇవ్వాలంది. జిహెచ్‌ఎంసి 18 శాతం కంటే 12 శాతంతో రూ.14.5 కోట్లు చెల్లించింది. ట్రాన్స్‌కో అడిగిన 27.5 శాతం ఇంజనీరింగ్, సూపర్‌విజన్ చార్జీలను ఇవ్వలేమని బల్దియా స్పష్టం చేస్తోంది.