పొంగిపొర్లుతున్న వంశధార, - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పొంగిపొర్లుతున్న వంశధార,

శ్రీకాకుళం, ఆగస్టు 9 (way2newstv.com):
ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని వంశధార నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నది సముద్రంలో కలిసే కళింగపట్నం సంగమం వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వరద భారీగా ఉండటంతో భూమి తీవ్రంగా కోతకు గురవుతోంది. అర కిలోమీటర్ మేర తీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురైంది. దీంతో కళింగ పట్నం బీచ్‌కు వెళ్లే రోడ్డు నామ రూపాల్లేకుండా కొట్టుకుపోయింది. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. పది అడుగుల లోతు మేర భూమి కోతకు గురైంది. 
పొంగిపొర్లుతున్న వంశధార, 

గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతంగా కళింగపట్నం తీర ప్రాంతంలో భూమి కోతకు గురైందని స్థానికులు చెబుతున్నారు. వరద ప్రవాహం ధాటికి బీచ్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన విగ్రహాలన్ని చూస్తుండగానే కొట్టుకుపోయాయి. భారీగా ఏర్పాటు చేసిన బుద్దుడు, ఏనుగు, జిరాఫీ విగ్రహాలన్ని కొట్టుకుపోతుంటే స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు. భూమి మరింత కోతకు గురైతే కళింగపట్నం ఊరంతా మునిగిపోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లైట్ హౌస్ దగ్గరకు కూడా వరద నీరు చేరుతోంది. నది సముద్రంలో కలిసే చోట భూమి కోతకు గురికాకుండా రివర్ బెడ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల ఆ రివర్ బెడ్ ఆక్రమణలకి గురికావడంతో నది ప్రవాహం కళింగపట్నం వైపు దిశను మార్చుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది