మళ్లీ భయపెడుతున్న స్వైన్‌ టెర్రర్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ భయపెడుతున్న స్వైన్‌ టెర్రర్‌

సికింద్రాబాద్‌, ఆగస్టు 20, (way2newstv.com)
మురికివాడలు, చెరువు పరిసర ప్రాంతాలు, నాలాల పరివాహక ప్రాంతాల్లో మలేరియా, స్వైన్‌ఫ్లూ, డెంగీ వ్యాధి లక్షణాలతో అనేక మంది బాధపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో దోమలు ఎక్కువ వృద్ధి చెందటం, దోమల వల్ల ప్రబలే వ్యాధులపై ప్రజల్లో అవగాహన లేకపోవటం వంటి కారణాలతో చాలా మంది జ్వరం, డెంగీ, స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న చిన్న క్లీనిక్‌లు, స్థానిక ప్రైవేటు నర్సింగ్ హోంలలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలుతోంది. 
మళ్లీ భయపెడుతున్న స్వైన్‌ టెర్రర్‌ 

ఇప్పటికే ఐదుగురు ఈ వ్యాధి అనుమానిత లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తాజాగా శుక్రవారం స్వైన్ ఫ్లూ లక్షణాలతో కరీంనగర్‌కు చెందిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. దీంతో స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. చల్లటి వాతావరణంలో స్వైన్‌ఫ్లూ వైరస్ మరింత వృద్ధి చెందే అవకాశముండటంతో ప్రజల్లో ఆందోళన రెట్టింపయ్యింది. గత సంవత్సరం ఇదే సీజనలో కూడా స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో పదుల సంఖ్యలో రోగులు గాంధీ ఆసుపత్రి, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరగా, వీరిలో ఇతర జిల్లాలకు చెందిన కొందరు మృతి చెందిన దాఖలాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరిణామాలతో గుణపాఠం నేర్వని జిల్లా వైద్యారోగ్యశాఖ ఈ సారైన కాస్త ముందుగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో వారికి చికిత్స అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా, సీజనల్ వ్యాధులు బారిన పడుతూ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. రోగుల రద్దీకి తగిన విధంగా ఔట్ పేషెంటు విభాగం పనివేళలు కూడా పెంచుకోవటంతో పాటు అదనపు సిబ్బంది విధులు నిర్వర్తిస్తోంది.