శ్రీ శైలం వివాదానికి ఏపీ సర్కార్ చెక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీ శైలం వివాదానికి ఏపీ సర్కార్ చెక్

కర్నూలు, ఆగస్టు 20, (way2newstv.com)
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వేలంపాట వివాదానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. దుకాణాల వేలంపాట నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ఈవో శ్రీరామచంద్ర మూర్తిపై బదిలీ వేటు వేసింది. కొత్త ఈవోగా ఎస్ రామారావును నియమించింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామచంద్ర మూర్తిని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. శ్రీశైలం ఆలయంలో దుకాణాల వేలంపాట వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆలయంలో అన్య మతస్థుల ప్రభావం ఎక్కువైందని.. వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని బీజేపీతో పాటు పలు హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
శ్రీ శైలం వివాదానికి ఏపీ సర్కార్ చెక్

ఈ ఆరోపణలతో వేలంపాటను అడ్డుకున్నాయి. అన్య మతస్థుల నుంచి శ్రీశైలాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చాయి. వేలంపాటదారుల మధ్య వివాదం చెలరేగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీశైలంలో షాపుల వేలం పాటలో ముస్లింలు పాల్గొన్నారని బీజేపీ నేత బడ్డా శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. అన్య మతస్థులకు ఈవో కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఆయన అనుచరులు నాలుగు రోజుల కిందట పలువురిపై దాడికి పాల్పడటంతో శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత మరింత పెరిగింది. శ్రీశైలం వివాదంపై స్పందించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఆలయ ఈవో తీరుపై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఓ వర్గానికి షాపులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అన్య మతస్థుల నుంచి శ్రీశైలం ఆలయాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ‘చలో శ్రీశైలం’ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ప్రదర్శనలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. చలో శ్రీశైలం కార్యక్రమానికి వెళ్లకుండా పలు చోట్ల ముందస్తు అరెస్ట్‌లు కూడా చేపట్టారు. ఈ క్రమంలో తాళ్లాయిపాలెం పీఠాధిపతి శివస్వామిని అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఆయలంలో వేలంపాటకు సంబంధించిన వివాదంపై పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి నిర్ణయించారు. మొత్తంమీద జగన్ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయంతో బీజేపీకి చెక్ పెట్టినట్లైంది..