వర్గపోరుతో కిల్లీ డీలా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వర్గపోరుతో కిల్లీ డీలా

శ్రీకాకుళం, ఆగస్టు 3, (way2newstv.com)
కిల్లి కృపారాణి. కాంగ్రెస్‌ హయాంలో 2009లో శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించిన ఆమె తర్వాత కాలంలో కేంద్రంలోనూ మంత్రి పదవిని చేపట్టారు. కేంద్ర మంత్రిగా చక్రం కూడా తిప్పారు. వృత్తి రీత్యా డాక్టర్‌ అయిన కిల్లి కృపారాణికి.. శ్రీకాకుళం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పలు కార్పొరేట్‌ వైద్యశాలలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె రాజకీయంగా ప్రముఖ పాత్ర పోషించాలని నిర్ణయించారు. ఇటు పేరుకు పేరుతోపాటు ఆసుపత్రుల అభివృద్ధికి కూడా తన రాజకీయాలను ఆమె వ్యూహాత్మకంగా వాడుకున్నారనే పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారికి ఇవన్నీ మామూలే. కాగా, రాష్ట్ర విభజన తర్వాత కిల్లి కృపారాణి కాంగ్రెస్‌కు దూరంగా జరిగారు. విభజనను వ్యతిరేకించే వారి పక్కన చేరలేదు. అలాగని తాను విభజనను సమర్థించనూ లేదు.అయినా.. పార్టీకి ప్రజల్లో ఆదరణ పోవడంతో కిల్లి కృపారాణి తటస్థంగా మారిపోయారు.
వర్గపోరుతో కిల్లీ డీలా

అయితే, ఈ దఫా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను విడిచి పెట్టారు. ఈ క్రమంలో తొలుత టీడీపీ వైపు చూసినా.. అక్కడ తనకు ఛాన్స్‌ లేదని గుర్తించిన కిల్లి కృపారాణి వెంటనే తన రాజకీయాలను వైసీపీ వైపు మళ్లించారు. ఎన్నికలకు కేవలం రెండు మాసాల ముందు ఆమె పార్టీ మారిపోయారు. ఈ క్రమంలోనే ఆమె టెక్కలి ఎమ్మెల్యే సీటు లేదా శ్రీకాకుళం ఎంపీ సీటును ఆశించారు. అయితే, అప్పటికే వైసీపీలో కీలక నాయకులుగా ఉన్న పేరాడ తిలక్‌, దువ్వాడ శ్రీనివాస్‌లు ఉన్నారు. దీంతో వీరిని కాదని ఎవరికీ టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జగన్‌ కిల్లి కృపారాణి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.తిలక్‌కు టెక్కలి టికెట్‌ ఇచ్చి, శ్రీనివాస్‌కు శ్రీకాకుళం ఎంపీ టికెట్‌ ఇచ్చారు. ఇక, అప్పుడే పార్టీలోకి వచ్చిన కిల్లి కృపారాణికి శ్రీకాకుళం జిల్లా పార్టీ వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. ఈ ముగ్గురూ కాళింగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే. ఎన్నిక‌ల‌కు ముందే టెక్కలి సీటు కాకుండా ప‌లాస‌లో కూడా ఈ సామాజిక‌వ‌ర్గం వాళ్లు ఎక్కువుగా ఉండ‌డంతో అక్కడ నుంచి పోటీ చేయాల‌న్న ఆఫ‌ర్ కూడా ఆమెకు వ‌చ్చింది. అయితే కిల్లి కృపారాణి మాత్రం టెక్కలి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం ఎంపీ సీటులో ఏదో ఒక‌టి మాత్రమే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. చివ‌ర‌కు ఆమెకు సీటు రాలేదు.పేరాడ‌, దువ్వాడ ఇద్దరు ఈమె నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు. అయితే, ఎన్నికల్లో స్వల్ప తేడాలతో తీవ్ర ఉత్కంఠ మధ్య ఇద్దరు నాయకులు ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు కిల్లి కృపారాణి చుట్టూ విమర్శలు ముసురుకున్నాయి. పార్టీని నడిపించే బాధ్యత చేతికి దక్కినా.. ఆమె సరైన విధంగా ముందుకు వెళ్లలేదని ఈ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దువ్వాడ, తిలక్‌ ఒక వర్గంగా కిల్లి మరో వర్గంగా ఏర్పడి రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వైసీపీదే అయినా.. జిల్లాలో మాత్రం పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరి జిల్లా వైసీపీ చీఫ్‌గా కిల్లి కృపారాణి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.