మోపిదేవి, ఇక్బాల్, చల్లాకు ఎమ్మెల్సీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోపిదేవి, ఇక్బాల్, చల్లాకు ఎమ్మెల్సీలు

విజయవాడ, ఆగస్టు 12 (way2newstv.co):
ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడ్డాయి. ఆగష్టు 26న ఎన్నికలు నిర్వహించనుండగా.. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. సంఖ్యాబలం కారణంగా ఈ మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన కరణం బలరామ కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీకి చెందిన ఆళ్ల శ్రీనివాస్ (నాని), కొలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందటంతో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఈ మూడు స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లకు తుది గడువు దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు. అందరూ ఊహించినట్టుగానే మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. 
మోపిదేవి, ఇక్బాల్, చల్లాకు ఎమ్మెల్సీలు

మూడో స్థానం కోసం కర్నూలు జిల్లా సీనియర్‌ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేశారు. ఇక్బాల్ హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడారు. మైనార్టీ కోటాలో ఆయన పేరు ఖరారు చేశారు. ఆది నుంచి తనతోపాటే ఉండి, కేసుల్లో జైలుకు వెళ్లిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తున్నారు. మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని చిలకలూరి పేటకు చెందిన మర్రి రాజశేఖర్‌కు కేటాయిస్తారని భావించారు. బీసీ మహిళ అయిన విడదల రజినీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్.. ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తే మర్రి రాజశేఖర్‌‌ను మంత్రి చేస్తానని మాటిచ్చారు. కానీ మంత్రివర్గ జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఆయనకు లభించలేదు. ఆయనకు వేరే ఏదైనా పదవి ఇస్తారని భావిస్తున్నారు. 
చల్లా కల నెరవేరింది
సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అందులో ఒకటి చల్లా రామకృష్ణారెడ్డికి కన్ఫర్మ్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. బనగానపల్లె లో పార్టీ విజయానికి కృషిచేసిన చల్లా రామకృష్ణారెడ్డిని ఎంపిక చేయడంతో జగన్ ఇచ్చిన మాట నిలబెట్టకున్నట్లయింది. ఎమ్మెల్సీ కావాలని గత కొన్నేళ్లుగా చల్లా రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. చల్లా ఎన్నిక లాంఛనమే. ఆయన కల నెరవేరినట్లే