హైద్రాబాద్, ఆగస్టు 23, (way2newstv.com)
హైదరాబాద్ లో మెట్రోకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులే కాకుండా మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వంటి దూర ప్రయాణం చేసే సాధారణ ప్రయాణీకులు కూడా మెట్రో జర్నీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక హైటెక్ సిటీ రూట్లో రివర్సల్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి హైటెక్ సిటీకి ఇలా రెండు కారిడార్ లలో నడుతోంది.. ఇందులో మరీ ముఖ్యంగా అమీర్ పేట నుంచీ హైటెక్ సిటీకి రోజూ వేలాదిమంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు.
మూడున్నర లక్షలకు చేరుకొన్న మెట్రో ప్రయాణికులు...
కాగా ఇప్పటి వరకు జూబ్లీ చెక్పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ ద్వారా రైళ్లు నడిచేవి.. దీంతో ప్రతి ఏడు ఎనిమిది నిమిషాలకు ఓ ట్రైన్ వచ్చేంది. తాజాగా హైటెక్ సిటీ రూట్ మెట్రో అధికారులు రివర్సల్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో హైటెక్ సిటీ వద్ద మెట్రో యూ టర్స్ తీసుకొనే అవకాశం కలిగింది.. దీంతో ఇక నుంచి అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడవనుంది. ప్రస్తుతం మెట్రో రైలు ప్రతి నాలుగు నిమిషాలకు ఒకటి వచ్చేది..భవిష్యత్తులో ప్రతి మూడు నిమిషాలకు ఓ ట్రైన్ నడిచేలా చేస్తామని చెబుతున్నారు మెట్రో రైలు అధికారులు.. ఏసీని సైతం సౌకర్యంగా ఉండేలా 23 డిగ్రీలకు తగ్గించారు. ప్రస్తుతం మెట్రోలో సగటున నిత్యం 3 లక్షల వరకు ప్రయాణిస్తునట్లు తెలుస్తోంది.. ఫ్రీక్వెన్సీ పెంపుతో ఈ సంఖ్య 3.50 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మెట్రో ప్రయాణం సుఖంగా, వేగంగా జరుగుతుండటంతో.. రోజు రోజుకీ భాగ్యనగర వాసులు.. మెట్రో ప్రయాణానికే ఆసక్తి చూపిస్తున్నారు