రాజకీయ దుమారం రేపుతున్న కోడెల మరణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజకీయ దుమారం రేపుతున్న కోడెల మరణం

గుంటూరు, సెప్టెంబర్ 17, (way2newstv.com)
కోడెల శివప్రసాద్ మరణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కోడెల ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. పోస్టు మార్టం నివేదిక రావాల్సి ఉంది. అయితే సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమంటున్నారు. కోడెల శివప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి అవమానాల పాలు చేసిందన్నారు. అవమానాలు తట్టుకోలేకనే కోడెల శివప్రసాద్ బలవన్మరణం పాలయ్యారని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పార్టీ అధ్యక్షుడే కోడెల శివప్రసాద్ మరణంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తున్నారు.మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కోడెల శివప్రసాద్ మెడపై గాయాలున్నట్లు చెప్పారు. అంటే సోమిరెడ్డి చెప్పిన దానిని బట్టి ఇది ఆత్మహత్య కాదని హత్యగా భావించాల్సి ఉంటుంది. 
రాజకీయ దుమారం రేపుతున్న కోడెల మరణం

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదంటూనే ప్రభుత్వ వేధింపులే కోడెల శివప్రసాద్ మృతికి కారణమని చెప్పడం గమనార్హం. కోడెల శివప్రసాద్ పై కేసులు ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయినా ఆయన ఏమాత్రం చలించలేదు.అయితే క్షణికావేశంలోనే ఆత్మహత్యలు జరుగుతాయని మానసిక వైద్యులు అంటున్నారు.అయితే కోడెల శివప్రసాద్ నిన్న రాత్రి తన సన్నిహితులతో కూడా ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. తనపై కేసుల విషయంలో తాను భయపడబోనని, న్యాయపరంగా ఎదుర్కొంటానని వారితో అన్నట్లు చెబుతున్నారు. అయితే వరస కేసులతో తన పరువు పోతుందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోడెల శివప్రసాద్ నిన్న రాత్రి సన్నిహితులతో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి వాడు కాదని చెబుతున్నారు.మరోవైపు వైసీపీ నేతలు కోడెల శివప్రసాద్ మృతిని టీడీపీ రాజకీయం చేస్తుందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. నిజంగా ప్రభుత్వ వేధింపులే కారణమయితే ఆయన సూసైడ్ నోట్ ప్రభుత్వంపై రాసి ఉండేవారు కదా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోడెల శివప్రసాద్ వంటి నేతలు మరణిస్తే…తాము చేసే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని కూడా నేతలు ఆలోచించడం లేదు. మొత్తం మీద కోడెల శివప్రసాద్ మరణం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా మార్చేశారు. కోడెల శివప్రసాద్ మృతి చెంది రెండు గంటలు కూడా గడవకముందే రాజకీయ దుమారం చెలరేగడం శోచనీయం. నేతలు సంయమనం పాటిస్తే బాగుంటుంది.
డేరింగ్ అండ్ డాషింగ్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తెలుగు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్రవేశారు. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఆయ‌న డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గానే కాకుండా… కొన్ని సార్లు వివాస్ప‌ద నేత‌గా కూడా గుర్తింపు పొందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌ తర్వాత రాష్ట్ర శాసనసభకు మొదటి స్పీకర్‌గా కోడెల పనిచేశారు. డాక్టర్‌ కోడెలగా శివప్రసాదరావు సుపరిచితులు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న కోడెల జన్మించారు. 1983లో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీలో చేరారు.1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల.. అపజయమెరుగని నేతగా గుర్తింపు పొందారు. 1983 నుంచి 1999 వరకు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా… 2014లో సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 వరకు శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌కు తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఆయ‌న రికార్డుల‌కు ఎక్కారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన కోడెల.. 1987-88లో రాష్ట్ర హోంమంత్రిగా, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖమంత్రిగా, 1997-99లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా సేవలు అందించారు.ఆయనకు భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి, కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు. స‌త్య‌నారాయ‌ణ గ‌తంలోనే రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందారు. అప్పుడు కొడుకు మృతితోనే కోడెల మాన‌సికంగా కుంగిపోయారు. గుంటూరు జిల్లా సిరిపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన కోడెల.. గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. కర్నూలులో ఎం.ఎస్‌. సర్జన్‌ పూర్తిచేసిన కోడెల వైద్యుడిగా.. అనంతరం రాజకీయ నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు.డాక్ట‌ర్ గానూ… ప‌ల్నాటి పులిగాను గుంటూరు జిల్లాలో కోడెల శివ‌ప్ర‌సాద్ ప్ర‌సిద్ధికెక్కారు. జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న ఎంతో మంది శిష్యుల‌ను త‌యారు చేశారు. య‌ర‌ప‌తినేని, జీవి.ఆంజ‌నేయులు, ఆల‌పాటి రాజా, న‌క్కా ఆనంద్‌బాబు, ప్ర‌త్తిపాటి పుల్లారావు వీళ్లంతా కోడెల శిష్యులే. ఇక టీడీపీలో ఆయ‌న అగ్ర‌నేత‌గా ఎదిగారు.గత ఎన్నికల్లో ఓటమితో పాటు.. పలు వివాదాస్పద అంశాల కారణంగా ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. చివరికి ఆత్మహత్యకు పాల్పడి… హఠాన్మరణం పొందడం.. పార్టీ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచింది.