వజ్ర యాప్ తో పిడుగుల సమాచారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వజ్ర యాప్ తో పిడుగుల సమాచారం

ఒంగోలు, సెప్టెంబర్ 5, (way2newstv.com)
ప్రస్తుతం వర్షా కాలం. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరుపులు కనిపిస్తున్నాయంటే.. దగ్గర్లో ఎక్కడో ఓ చోట పిడుగు పడే అవకాశం ఉందని భావిస్తాం. పిడుగు పడటం ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారింది. పిడుగుపాటు వల్ల ఎదురయ్యే విపత్తును నివారించడానికి విపత్తుల నివారణ సంస్థ ఆధనిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పిడుగు పాటుకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తుంది. 30 నిమిషాల ముందుగా అధికారుల ద్వారా ఆ ప్రాంత సెల్‌ఫోన్‌లకు అలర్ట్‌ మెసేజ్‌లను అందుబాటులోకి వస్తున్నాయి.ఎన్నో మూగజీవాలతోపాటు ఎందరో మనుషులు బలై ప్రాణాలు పోతున్నాయి. 
వజ్ర యాప్ తో పిడుగుల సమాచారం

ముఖ్యంగా వ్యవసాయ పొలాలు, చెట్ల కింద వున్న ఉన్న వారే ఎక్కువగా గురవుతున్నట్లు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ పిడుగు పాటుకు గురైతే వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రథమ చికిత్స ఎలా అందించాలి, సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం మొదలైన అంశాలపై నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి. వీటిని పాటించి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిద్దాం. పిడుగు పడే సమయంలో వచ్చే మెరుపులో ఎంతో తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది. అది తాకిన మరుక్షణం జీవి ఏదైనా ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. పిడుగు దాదాపుగా ఎత్తైన చెట్లు, భవనాలు, ప్రదేశాలు, వస్తువులపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు తక్కువ ఉన్న చోట కాస్త సురక్షితం. పచ్చని చెట్లను తాకే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో చెట్ల కింద ఉండరాదు. ఆరుబయట ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  వీలైనంత వరకు సురక్షిత భవనాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాలి. పొలంలో పూర్తి ఆరుబయట ఉంటే మొక్కల కన్నా మనిషి ఎక్కువ ఎత్తు ఉంటాడు.. కాబట్టి పిడుగు అతనిపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు పడేటపుడు అర చేతులతో చెవులను మూసుకుని తల వంచుకుని నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. మొబైల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు. విద్యుత్, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడకుండా ఉండటం మంచిది. పిడుగుపాటుకు గురైతే అంబులెన్స్, వైద్యులకు సమాచారం అందించాలి. బాధితుడికి ప్రథమ చికిత్స అందించాలి. పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే.. దుప్పటి లాంటి వస్త్రంపై పడుకోబెట్టాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘వీఏజేఆర్‌ఏపీఏఏటీ ’ అని టైప్‌ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జియో ట్యాగింగ్‌ కోసం మొబైల్‌ఫోన్‌ నంబర్‌ను అడుగుతుంది. నంబర్‌ను ఎంటర్‌ చేసి భాష ఎంచుకోవాలి. యాప్‌ ముఖ చిత్రం కనిపిస్తుంది. లొకేషన్‌ సెట్‌ చేసుకుంటే.. మీరు ఉండే ప్రదేశంలో పిడుగు పడే అవకాశాలపై తగిన సమాచారం, సూచనలు అందిస్తుంది. యాప్‌ రెండు రకాల సమాచారాన్ని ఇస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో వున్న చోట క్లిక్‌ చేస్తే మీరున్న ప్రాంతం మ్యాప్‌ వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు కనిపిస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం పిడుగు పడే అవకాశాలను చూపిస్తుంది. పిడుగు ఎంత దూరంలో పడుతుందో.. పిన్‌ గుర్తు ద్వారా స్పష్టత ఇస్తుంది. యాప్‌ కుడి భాగంలో పిడుగు పాటు హెచ్చరికలు తెలిపే బటన్‌ ఉంటుంది. యాప్‌ ఆన్‌ చేసి ఎప్పటికప్పుడు  సమాచారం తెలుసుకోవచ్చు.