ఎయిమ్స్, జిప్ మర్ కు నీట్ పరీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎయిమ్స్, జిప్ మర్ కు నీట్ పరీక్ష

న్యూఢిల్లీ, అక్టోబరు 5, (way2newstv.com)
శంలోని అన్ని వైద్య కళాశాలలతోపాటు ఎయిమ్స్, జిప్‌మర్‌లో ప్రవేశాలను కూడా ఇకపై నీట్ ద్వారానే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అక్టోబ‌రు 4న‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశీయ వైద్యవిద్యలో ఏకీకృత ప్రమాణాల సాధనకు ఈ విధానం దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులు వైద్యవిద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం వివిధ పరీక్షలు, కౌన్సెలింగ్‌లు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పుతుందని హర్షవర్ధన్ అన్నరు. 
ఎయిమ్స్, జిప్ మర్ కు నీట్ పరీక్ష

దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఎయిమ్స్, జిప్‌మర్‌ తప్ప మిగతా అన్ని వైద్యకళాశాలల్లో నీట్ ద్వారానే ప్రవేశాలు జరుగుతున్నాయి. ఎయిమ్స్, జిప్‌మర్‌‌లకు మాత్రమ ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 'నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం-2019' ప్రకారం దేశంలోని అన్ని వైద్యకళాశాలల ప్రవేశాలకు కూడా ఇకపై 'నీట్‌' తప్పనిసరి కానుంది. ఈ కొత్త చట్టం ప్రకారం ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, కౌన్సెలింగ్.. అలాగే ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి.కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరంలోనే 'నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌)' పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగానే పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడంతో పాటు.. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేయడానికి అవసరమైన లైసెన్స్‌‌ను మంజూరు చేస్తారు. విదేశాల్లో మెడిసిన్ చదివిన విద్యార్థులకు కూడా ఈ పరీక్షనే 'స్క్రీనింగ్‌ టెస్ట్‌'గా పరిగణిస్తారు. అయితే పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఎన్నిసార్లయినా 'నెక్స్ట్‌' పరీక్ష రాసే వెసులుబాటు ఉండనుంది. ఎలాంటి పరిమితులు ఉండబోవు.