11 ఏళ్ల నుంచి సాగుతున్న కనుపూర్ కెనాల్ లైనింగ్ వర్క్ప్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

11 ఏళ్ల నుంచి సాగుతున్న కనుపూర్ కెనాల్ లైనింగ్ వర్క్ప్

నెల్లూరు, నవంబర్ 5, (way2newstv.com)
నెల్లూరు జిల్లాలోని 66 వేల ఎకరాలకు సాగునీరందించే కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ వర్క్స్‌ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో ప్యాకేజీ–4 కింద రూ.71.94 కోట్లు మంజూరు చేశారు. ఆయా పనులను ఏకేఆర్‌ కోస్టల్‌ కంపెనీ పేరుతో  టెండర్‌ ద్వారా చేజిక్కించుకుని 2008 మార్చి మూడోతేదీన అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రెండేళ్లలో ఆయా పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్‌లో చూపించారు. ఆ నిధులతో జిల్లాలోని సంగం నుంచి బండేపల్లి వరకు సుమారు 55 కిలో మీటర్లు కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ వర్క్స్, 44 స్ట్రెక్చర్స్‌ రిపేర్లు చేయాల్సి ఉంది. ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పర్శింటేజీలు తీసుకుని సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించారు. 55 కిలోమీటర్ల  వరకు కెనాల్‌ లైనింగ్‌ పనులను భాగాలుగా విభజించి సబ్‌ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. 
11 ఏళ్ల నుంచి సాగుతున్న కనుపూర్ కెనాల్ లైనింగ్ వర్క్ప్

కానీ పదకొండేళ్లు పూర్తయినా కూడా లైనింగ్‌ పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 66 వేల ఎకరాలకు సాగునీరు అందించే కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ పనులు నిలిచిపోవడంతో ఆ ఆయకట్టు రైతులకు సాగునీరు సక్రమంగా అందడంలేదని ఆ ప్రాంత రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌ లైనింగ్, స్టేక్చర్స్‌ రిపేర్లు జరిగి ఉంటే సాగునీరు సకాలంలో అందే అవకాశం ఉంది. ఆయా పనులు జరగకపోవడంతో కెనాల్‌లో సాగునీరు సక్రమంగా పారుదల లేక చివరి ఆయకట్టు వరకు అందక ఎండిపోతుందని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు.ఇప్పటివరకు 51.94 శాతం పనులే పూర్తి చేశారు. మిగిలిన 48.6 శాతం పనులు పూర్తికాలేదు. టెండర్‌ అగ్రిమెంట్‌లో మాత్రం రెండేళ్లకాల వ్యవధిలో పూర్తిచేస్తానని చూపించినా దశాబ్దకాలం దాటినా కూడా పనులు పూర్తి చేయకపోవడం వెనుక కాంట్రాక్టర్‌ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. గత టీడీపీ  ప్రభుత్వంలో మాత్రం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామంటూ కల్లిబొల్లి మాటలతో నెట్టుకొచ్చారే తప్పా ప్యాకేజీ –4 పనులపై గత పాలకులు దృష్టిసారించలేకపోయారు. కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీలు తీసుకుంటూ పనులు చేయని వారికి వత్తాసు పలుకడంతో ప్యాకే జీ–4 పనుల్లో అడుగుమందుకు పడలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీకీలక నేతలతో సత్సబంధాలు నెరిపిన కాంట్రాక్టర్‌ ప్యాకేజీ–4 పనులు నత్తనడకన సాగిస్తున్న కాంట్రాక్టర్‌పై  చర్యలు తీసుకున్న దాఖాలాలు కన్పించలేదు. గతేడాది నుంచి కెనాల్‌ లైనింగ్‌ పనులు పూర్తి స్థాయిలో నిలపివేశారు. పూర్తయిన పనులకు దాదాపు రూ.4 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సాకు చూపి సదరు కాంట్రాక్టర్‌ పూర్తిస్థాయిలో పనులు నిలిపివేసినట్లు అధికారులు చెపుతున్నారు. ప్రతిఏటా ఆ వర్క్స్‌ అగ్రిమెంట్‌ పెంచుకుపోతున్నా కూడా కాంట్రాక్టర్‌ సహకరించడం లేదని అధికారులు తెలిపారు. పనులు పూర్తిచేయాలని రెండు సార్లు నోటీసులు జారీ చేసినా కాంట్రాక్టర్‌ నుంచి స్పందన లేదని తెలుస్తోంది.