విజయనగరంలో మూతపడనున్న పరిశ్రమలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయనగరంలో మూతపడనున్న పరిశ్రమలు

విజయనగరం, నవంబర్ 2, (way2newstv.com)
విజయనగరం జిల్లాలో  ఉన్న కొద్దిపాటి పరిశ్రమలపైనా మాంద్యం ప్రభావం తీవ్రంగా పడింది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు మూతబడ్డారు. దీంతో, వందలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. మరికొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే మరిన్ని పరిశ్రమలు మూతబడి, ఇంకొంతమంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో ముఖ్యంగా 'ఫెర్రో ఎల్లాయీస్‌, పెంకుల పరిశ్రమలపై మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉంది.గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బొబ్బిలి, కొత్తవలస ప్రాంతాల్లో 18 ఫెర్రో పరిశ్రమలు ఉండేవి. గత నాలుగేళ్లలో నాలుగు పరిశ్రమలు మూతబడ్డాయి. మాంద్యం ప్రభావంతో గత నాలుగు నెలల్లో మరో నాలుగు పరిశ్రమలను వేశారు. 
విజయనగరంలో మూతపడనున్న పరిశ్రమలు

తాజాగా మూతబడిన వాటిలో మెరకముడిదాం మండలంలోని ఆంధ్రా ఫెర్రో, గుర్లలోని ఎఎస్‌వి పరిశ్రమలు, బొబ్బిలిలోని సిరీ, యోనా పరిశ్రమలు ఉన్నాయి. దీంతో, సుమారు వెయ్యిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. తిరుగుతున్నవి పది ఫ్యాక్టరీలు కూడా సగానికిపైగా ఉత్పత్తులు తగ్గించుకున్నాయి. ఫేకర్‌ పరిశ్రమ మూత దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. విశాఖ స్టీల్‌ప్లాంటుతో పాటు కోల్‌కత్తా, బిలారు, రాయపూర్‌ వంటి ప్రాంతాలకు ఫెర్రోఎల్లాయీస్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. భవన నిర్మాణం సంక్షోభం కారణంగా విశాఖ స్టీల్‌ప్లాంట్లు కూడా ఉత్పత్తిని తగ్గించుకుంది. దీంతో, ఫెర్రో ఉత్పత్తులకు తగిన ధర పలకడం లేదు. దీంతో, ఒక్కో ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలో రెండు వేల నుంచి మూడు వేల టన్నుల ఉత్పత్తులు మూలుగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా డిమాండ్‌ లేక విదేశీ ఆర్డర్లు తగ్గడంతో నిల్వలు పేరుకుపోయి పెర్రో పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయి.కొత్తవలస మండలంలోని లక్ష్మీటైల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్రమలో ఒకప్పుడు రోజుకు 200 మంది కార్మికులు పని చేసేవారు. నేడు ఏడుగురు కార్మికులతో ఫ్యాక్టరీ నడుస్తోంది. అదీ ఆర్డర్‌ ఉన్నప్పుడే పరిశ్రమలో ఉత్పత్తి జరుగుతోంది. ఆర్డరు లేకపోతే ఉత్పత్తిని నిలిపేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు 50 శాతంపైనే జరిగిన ఉత్పత్తి నేడు ఒక్కసారిగా 20 శాతానికి పడిపోయింది. ఆగస్టులో కేవలం రూ.30 వేలు విలువైన ఉత్పత్తి కూడా జరగక కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేక ఈ పరిశ్రమ యాజమాన్యం అవస్థలు పడుతోంది. రాష్ట్రంలో గతంలో 117 పెంకుల ఫ్యాక్టరీలు ఉండేవి. ఒక్క కొత్తవలసలోనే 27 ఫ్యాక్టరీలు నడిచేవి. ఉత్తరాంధ్రతోపాటు ఉత్తరప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలకు అక్కడ నుంచి ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ప్రభుత్వాల విధానాల కారణంగా కొత్తవలసలోని 21 పెంకుల ఫ్యాక్లరీలు గతంలోనే మూతబడ్డాయి. మాంద్యం ప్రభావంతో ఈ ఏడాది మరో మూడు ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. వాటిలో రాజేంద్ర టైల్స్‌, ఎస్‌విఎల్‌ఎన్‌ ట్రేడర్స్‌, డాల్ఫిన్‌ టైల్స్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయారు. మిగిలిన మూడు ఫ్యాక్టరీలూ దినదినగండంగా నడుస్తున్నాయి. ఇసుక కొరతతో గత నాలుగు నెలలుగా భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఎలివేషన్‌కు, పైకప్పులకు వాడే పెంకుల వాడకం నిలిచిపోయింది. ఇప్పటికే మట్టి అందుబాటులో లేక ఉత్పత్తి ఖరీదు పెరిగి, నష్టాల పాలవుతున్న పెంకుల ఫ్యాక్టరీలపై ఆర్థిక మాంద్యం ప్రభావం మరింత పడింది.పూసపాటిరేగ ప్రాంతంలోని విజయనగరం బయోటెక్‌ ఆగ్రోబేసిడ్‌ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లో 30 శాతం ఉత్పత్తులను తగ్గించుకోవాల్సి వచ్చిందని యాజమాన్యం తెలిపింది. భోగాపురం మండల కేంద్రంలోని సంజీవ్‌ గ్రానైట్‌ పరిశ్రమలో రోజుకు 30 మంది కార్మికులు పని చేసేవారు. సంక్షోభ ప్రభావంతో ప్రస్తుతం వారిలో పది మందికి కూడా పని దొరకడంలేదు. జిల్లాలోని యాభైకి పైగా గ్రానైట్‌ పరిశ్రమల్లో ఇదే పరిస్థితి ఉంది