అనంతపురంలో నీటికి కటకటే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతపురంలో నీటికి కటకటే

అనంతపురం, నవంబర్ 13, (way2newstv.com)
వేసవికి ముందే తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆవాసాలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలకు తాగునీరు అందకపోవడంతో వీరు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 34.40 శాతం వర్షపాతం లోటు రాష్ట్రంలో నెలకొంది. నీటి వనరులు అడుగంటడంతో సమస్య తీవ్రమవుతోంది. 1,091 ఆవాసాలకు తాగునీరు అందకపోవడంతో గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ట్యాంకర్లతో నీటి సరఫరా చేపట్టింది. అది అరకొరగానే సాగుతోంది. తాగునీటి సమస్యను గుర్తించిన ఎనిమిది జిల్లాల్లో 1,774 ట్యాంకర్లతో రోజుకు 6,550 ట్రిప్పులు వేయాల్సి ఉండగా, 4,800 నుంచి 5,200 లోపు ట్రిప్పులు మాత్రమే వేస్తున్నారు. 
అనంతపురంలో నీటికి కటకటే

26.17 ఎంఎల్‌డిల(రోజుకు 2కోట్ల 61 లక్షల 70 వేల లీటర్లు) తాగునీటిని అందించాల్సి ఉండగా ప్రస్తుతం అందిస్తున్నది మాత్రం 18 నుంచి 22 ఎంఎల్‌డిలు (180 నుండి 210 లక్షల లీటర్లు) మాత్రమే. గ్రామాల్లో బిందెనక బింది వరుస కట్టి, ట్యాంకర్ల రాక కోసం ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పలు వేదికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేశామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తూనే ఉంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నీరు లేకపోవడంతో పాఠశాలల్లో మరుగుదొడ్లు వినియోగంపై నిషేధం విధించినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో ఒవర్‌ హెడ్‌ ట్యాంకులు, బోర్లు ఉన్నా మరమ్మతుల కారణంగా నీరందించలేని పరిస్థితి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని పలు బోర్లు భూగర్భజలాలు అడుగంటడంతో నీరు అందడం లేదు. రానున్న నాలుగు నెలల్లో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామాల్లో రోజు రోజుకు మరుగున పడిపోతున్నాయి. పైపులైన్లు మరమ్మతులకు గురికావడం, లేదా పథకమే శిథిలావస్థకు చేరిపోవడం తదితర కారణాల వలన ఈ ట్యాంకులు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. దీనిపై గ్రామదర్శిని వంటి కార్యక్రమాల్లో అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించకపోవడంతో ఆయా గ్రామస్తులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాళ్లపాలెం సంత వద్ద సుజల స్రవంతి ద్వారా అనకాపల్లి మండలం సంపత్‌పురం నుండి వస్తున్న మంచినీరు గత పది రోజులుగా నిలచిపోయింది. దీంతో తాగునీటిక కోసం గ్రామస్తులు తీవ్ర ఎదుర్కొంటున్నారు. సంపత్‌పురం నుండి ఐదు మండలాల్లో 110 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ట్యాంకులు ఏర్పాటు చేశారు. అయితే పది రోజులుగా తాళ్లపాలెం సంత నుండి భీమవరం, కన్నూరుపాలెం గ్రామాలకు ఈ సుజల స్రవంతి నుంచి నీరు సరఫరా రావడం లేదు. దీనిపై అధికారులు మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరుతున్నప్పటికీ వారంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పది రోజుల నుండి సుమారు 10 గ్రామాలకు సరఫరా నిలచిపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నీటిని అందించేందుకు కృషి చేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు