టీడీపికి కఠిన మైన పరీక్షలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపికి కఠిన మైన పరీక్షలు

ఏలూరు, నవంబర్ 20, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని నేడు ఎదుర్కొంటున్నారు. మూడు దశాబ్దాలుగా పైగానే ఆవర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కొనలేదనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ ను తప్పించినప్పుడు, హరికృష్ణ , లక్ష్మీపార్వతి లు వేర్వేరుగా పార్టీలు పెట్టినప్పుడు కూడా పసుపుదళంలో ఇంత గుబులు లేదు. కానీ గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను మాత్రం గమనిస్తున్న పార్టీ సీనియర్ నేతలు ఆందోళనలోనే ఉన్నారు. సీనియర్ నేతల అంచనా ప్రకారం పార్టీని తిరిగి పట్టాలెక్కిచడం చంద్రబాబుకు చాలా కష్టంతో కూడుకున్న పనేనని అంగీకరిస్తున్నారు.గతంలో ఇప్పుడు రాజకీయాలు లేవు. రెండు దశాబ్దాలకు ముందు ఒక పార్టీ, ఒక జెండాను నమ్ముకుని రాజకీయం నడిచేది. 
టీడీపికి కఠిన మైన పరీక్షలు

కార్యకర్తలు కూడా నేతలతో సంబంధం లేకుండా పార్టీని నమ్ముకుని ఉండేవారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి గ్రామ గ్రామాన బలమైన క్యాడర్ ఉంది. వారంతా ఎన్టీఆర్ పై అభిమానం, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలకు ఆకర్షితులయ్యారు. వారు డబ్బులు తీసుకుని పార్టీ కోసం పనిచేయలేదు. ఎన్టీఆర్ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న కార్యకర్తలు అనేకమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అగ్రనేతల దృష్టిలో పడాలని కాకుండా తమ సంతృప్తి కోసం పార్టీకి పనిచేసేవారు.కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవన్నది వాస్తవం. నేతలే పార్టీ మారుతున్నప్పుడు కార్యకర్తల్లో కూడా అంతటి పట్టుదల, అభిమానం ఉన్న వారు అరుదుగానే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు తాను ఒక నాయకుడు వెళ్లిపోతే వంద నాయకులను తయారు చేస్తానని చెబుతున్న మాట ఆచరణలో సాధ్యం కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో డబ్బులు పెడితేనే నేతగా ఎదుగుతారు. డబ్బుతో పాటు సామాజిక వర్గం కూడా గెలుపులో ప్రధాన పాత్రపోషిస్తుంది. అందుకే నాయకులను ఎన్టీఆర్ చేసినంత ఈజీగా చంద్రబాబు చేయలేరన్నది అందరూ అంగీకరించే సత్యమే. ఎందుకంటే ఆరోజులు వేరు ఈరోజులు వేరు.ఇప్పుడు నాయకుల వెంటే కార్యకర్తలు ఉంటున్నారు. ఏపార్టీకయినా కార్యకర్తలు నాయకుల నమ్మిన బంటుగా ఉంటున్నారు. ఇప్పుడు వెళ్లిపోతున్న నాయకుల వెంట కార్యకర్తలూ పార్టీలను వీడి వెళుతున్నారు. ఇంతకుముందులాగా ఒక నాయకుడు పార్టీని వీడితే నష్టం లేదనుకోవడం భ్రమ. ఖచ్చితంగా పార్టీ పై ప్రభావం చూపుతుంది. ఇది అన్ని పార్టీలకూ దాదాపుగా వర్తించినా టీడీపీకి మాత్రం సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు కాబట్టి కొత్త నాయకత్వం రావడం కష్టమేనని చెప్పాలి. వచ్చినా నిలదొక్కుకోవడమూ అనుమానమే. అందుకే చంద్రబాబు పార్టీని వీడుతున్న నేతల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.