మహారాష్ట్రలో కొత్త జోడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహారాష్ట్రలో కొత్త జోడి

ముంబై, నవంబర్ 20  (way2newstv.com)
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి శివసేన చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించడం, ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కావడంతో మహా రాజకీయం మరింత వేడెక్కింది. పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానితో శరద్ పవార్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ... ఇద్దరు నేతలు కలిస్తే ఎలా పడితే అలా ఊహించేస్తారా, ప్రధాని దేశం మొత్తానికీ చెందిన వ్యక్తి అని మండిపడ్డారు. 
మహారాష్ట్రలో కొత్త జోడి

మహారాష్ట్రలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, పవార్‌జీ, ఉద్ధవ్‌జీ ఇద్దరూ వారి గురించే ఆలోచిస్తున్నారన్నారు.ఇద్దరు కీలక నేతలు భేటీ అయితే కిచిడీ వండేస్తారా? ప్రధాన మంత్రిని పార్లమెంటు లోపలా, బయటా ఎక్కడైనా కలవచ్చని ఉద్ఘాటించారు. ఆయనతో సమావేశమయ్యే హక్కు అందరికీ ఉంటుదని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంపై పవార్‌కు మంచి అవగాహన ఉందని, రాష్ట్ర పరిస్థితులు ఆయనకు బాగా తెలుసని మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానితో చర్చించాల్సిందిగా మేం కూడా ఆయన్ను కోరామన్నారు.అంతేకాదు, రాష్ట్రంలో రైతు సమస్యలను వివరించడానికి రాష్ట్రానికి చెదిన ఎంపీలు, వివిధ పార్టీల నేతలు ప్రధానిని కలుస్తారని తెలిపారు. కేంద్రం నుంచి రైతులకు వీలైనంత సాయం అందేలా తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై రెండు వారాల కింద ఉన్న ఇబ్బందులు ఇప్పుడు లేవని, ఇక సాగదీత ఉండదన్నారు. మరో రెండు రోజుల్లో విషయం తేలిపోనుందని, సంక్షోభానికి తెరపడుతుందని రౌత్ పేర్కొన్నారు.స్థిరమైన ప్రభుత్వ ఏర్పాట్లు మరో ఐదారు రోజుల్లో పూర్తవుతాయని, డిసెంబరుకు ముందే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని సంజయ్ రౌత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీలు బుధవారం సాయంత్రం సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పవార్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.