80 రూపాయిలకు చేరిన ఉల్లిపాయలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

80 రూపాయిలకు చేరిన ఉల్లిపాయలు

కర్నూలు, డిసెంబర్ 7, (way2newstv.com)
సామాన్యులకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కిలో రూ.150 వరకూ పలికిన ఉల్లి ధరలు వంద రూపాయల దిగువకు చేరాయి. నిన్నటి వరకు కర్నూల్‌ మార్కెట్‌లో క్వింటా ఉల్లి రూ.12,500 నుంచి రూ.15,000 వరకూ ధర పలికింది. ఉల్లి ధరలు నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ధర గణనీయంగా పడిపోయింది. కర్నూల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర ప్రస్తుతం రూ.8,600కు దిగింది.జగన్ సర్కార్ కీలక ఆదేశాలతో ఉల్లి ధరలు దిగొచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అవసరాలు తీరకుండా ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఉల్లి ఎగుమతులు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఉల్లి లోడు లారీలను సైతం సీజ్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ తక్షణ చర్యలతో ఏపీలో ఉల్లి ధరలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. 
80 రూపాయిలకు చేరిన ఉల్లిపాయలు

ప్రస్తుతం కర్నూల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.86 నుంచి రూ.80కి పడిపోయింది.దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటున్నాయి. హైదరాబాద్, చెన్నైలో రూ.150కి పైగా ధర పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గరిష్టంగా రూ.180 రూపాయలకు చేరినట్లు సమాచారం. ఇటీవల మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణ స్థాయి కంటే ఉల్లి దిగుబడులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉల్లి అందుబాటులో లేకపోవడంతో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాయి. కేంద్రం ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ధరలు మాత్రం అదుపులోకి రాలేదు. ఏపీలో భిన్న పరిస్థితులున్నాయి. ఏపీలోని కర్నూల్ మార్కెట్ ఉల్లికి ప్రసిద్ధి. అయితే ఇతర రాష్ట్రాల్లో ధరలు విపరీతంగా పలుకుతుండడంతో స్థానిక వ్యాపారులు లాభాల కోసం ఉల్లిని పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఏపీలోనూ ఉల్లి ధర కిలో రూ.150 దిశగా పరుగులు పెట్టింది. స్పందించిన ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలో ఉల్లి కొరత బాగా ఉందని.. స్థానిక అవసరాలు తీరకుండా ఎగుమతులు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అపరమతంతమైన మార్కెటింగ్ శాఖ అధికారులు ఉల్లి ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టారు. ఉల్లి ఎగుమతులను నిలిపివేశారు. దీంతో కర్నూల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే ప్రభుత్వం కిలో రూ.25కే సబ్సిడీపై ఉల్లి సరఫరా చేస్తోంది. ఒక్కొక్కరికి కిలో ఉల్లిపాయల చొప్పున రైతు బజార్లలో అందజేస్తున్నారు.బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో వినియోగాదారులు.. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజార్లకు పరుగులు తీస్తున్నారు. కిలోమీటర్ల పొడవున క్యూ లైన్లలో బారులుదీరుతున్నారు. రైతుబజార్లకు జనం భారీగా వస్తుండడంతో తోపులాటలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో తొక్కిసలాట జరిగింది. విజయనగరం జిల్లాలో ఉల్లిపాయల కోసం మహిళలు గోడలు దూకి మరీ వెళ్తున్న పరిస్థితులు కనిపించాయి.