భాగ్యనగరికి హై స్పీడ్ ట్రైన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భాగ్యనగరికి హై స్పీడ్ ట్రైన్

హైద్రాబాద్, డిసెంబర్ 7, (way2newstv.com)
ముంబై నుంచి హైదరాబాద్‌కు పుణే మీదుగా హైస్పీడ్‌ రైలు మార్గం నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదిక (డీపీఆర్‌)ను రెడీ చేయాలని నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ఆదేశించింది. ఈ మార్గమే కాకుండా మరో ఐదు మార్గాలను కూడా స్టడీ చేయాలని చెప్పింది. ఈ ఆరు కారిడార్లలో రెండు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ముంబై, నాసిక్‌, నాగపూర్‌ మధ్య 753 కిలోమీటర్లు.. ముంబై, పుణే, హైదరాబాద్‌ మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్లను నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, కాన్పూర్‌, లక్నో, వారణాసి మీదుగా 865 కిలోమీటర్లు.. ఢిల్లీ, జైపూర్‌, ఉదయ్‌పూర్‌, అహ్మదాబాద్‌ మీదుగా (886 కిలోమీటర్లు), చెన్నై, బెంగళూరు, మైసూరు (435 కిలోమీటర్లు),  ఢిల్లీ, చండీగఢ్‌, లుధియానా, జలంధర్‌, అమృత్‌సర్‌ (459 కిలోమీటర్లు) మీదుగా కారిడార్లు నిర్మించాలని ఆలోచిస్తోంది.
భాగ్యనగరికి హై స్పీడ్ ట్రైన్

ఆరు బుల్లెట్‌ రైలు మార్గాల ద్వారా డైమండ్‌ క్వాడ్రిలేటరల్‌ను సృష్టించాలని కేంద్రం భావిస్తోంది. అలా దేశంలోని పెద్ద నగరాలు, ఎకనమిక్‌ సెంటర్లను హై స్పీడ్‌ రైలు ద్వారా కనెక్ట్‌ చేయాలనుకుంటోంది. ఈ ఆరు ప్రాజెక్టుల స్టడీ కోసం ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఓ కన్సల్టెంట్‌ను నియమించే పనిలో ఉంది. ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ డిమాండు, ఏ మార్గం (భూమిలోపల, నేలపై)లో ప్రాజెక్టును చేపడితే బాగుంటుందో తెలుసుకోనుంది. నివేదిక రెడీ అయ్యాక చివరి పరిశీలన కోసం రైల్వే బోర్డుకు ఇవ్వనుంది. తర్వాత కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ముంబై, అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ బిజీగా ఉంది. ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర, గుజరాత్‌లు రూ. 5 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నాయి. రైల్వే బోర్డు మరో రూ.10 వేల కోట్లు ఇవ్వనుంది. మరో 81% నిధులను జపాన్‌ సంస్థ జికా అందించనుంది.