రాజధానిపై కొనసాగుతున్న గందరగోళం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధానిపై కొనసాగుతున్న గందరగోళం

విజయవాడ, డిసెంబర్  14 (way2newstv.com)
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందంటూ లిఖితపూర్వకంగా ఏపీ అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిగా అమరావతిని మార్చే ఉద్దేశం ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు... అలాంటి ఉద్దేశం లేదని మండలిలో ఆయన తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉంది. సమస్యంతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇదే మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల వల్లే వచ్చింది. అమరావతికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఓసారి... అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలంటే... ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని మరోసారి... ఇలా రకరకాల ప్రకటనలు చేసిన ఆయన ప్రజల్లో గందరగోళానికి తెరతీశారు. ఓ దశలో... ప్రకాశం జిల్లాలోని దొనకొండను రాజధానిగా చేస్తారనే ప్రచారం కూడా సాగింది. 
రాజధానిపై కొనసాగుతున్న గందరగోళం

టీడీపీ ఎంపిక చేసిన అమరావతిని తామూ కొనసాగిస్తే... క్రెడిట్ మొత్తం టీడీపీకే దక్కుతుందనే ఉద్దేశంతోనే బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆరు నెలల తర్వాత అదే బొత్స సత్యనారాయణ రాజధానిగా అమరావతే ఉంటుందని చెప్పడంతో... ఈ వివాదానికి చెక్ పడిందని అనుకోవచ్చు. ఐతే... ఈ ఆరు నెలల్లో జరిగిన నష్టానికి ఏం సమాధానం చెబుతారన్నది తేలాల్సిన ప్రశ్న.వైపీసీ అధికారంలోకి వచ్చాక... అమరావతిలో రియల్ ఎస్టేట్‌, నిర్మాణాల విషయంలో ఒకింత గందరగోళం ఏర్పడింది. ఎప్పుడైతే బొత్స రాజధానిపై విరుద్ధ ప్రకటనలు చేశారో... రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది. నిర్మాణాలు ఆగిపోయాయి. ఉన్న కంపెనీలు చెల్లా చెదురయ్యాయి. కార్మికులకు ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయి. టోటల్‌గా అమరావతి ఆశలు ఆవిరయ్యాయి. ఆరు నెలలుగా అక్కడ ఎలాంటి అభివృద్ధీ లేదు. నిర్మాణాలూ ఆగిపోయాయి. దీనంతటికీ కారణం బొత్స వ్యాఖ్యలే అంటున్నా్రు స్థానికులు.రాజధానిగా అమరావతినే కొనసాగించే ఉద్దేశం ఉన్నప్పుడు బొత్స ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చెయ్యాలి? ఇలా చెయ్యడం ద్వారా ప్రభుత్వం సాధించిందేంటి? అభివృద్ధిని అణచివేయడం ద్వారా ఏ ప్రయోజనం లభించింది అంటున్న టీడీపీ నేతల ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యకపోయి ఉంటే... ఈపాటికే చాలా అభివృద్ధి జరిగేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐతే... ఇప్పటికైనా అమరావతి విషయంలో ప్రభుత్వం ఓ క్లారిటీకి రావడం ఆశించదగ్గ పరిణామమే. ఇకపై రాజధాని నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తే... తిరిగి రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశాలుంటాయి. అలాగే పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థల రాక, నిర్మాణాలు అన్నీ సమకూరే పరిస్థితులు ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.