మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్ చిచ్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్ చిచ్చు

హైద్రాబాద్, డిసెంబర్ 27  (way2newstv.com)
తెలుగు రాష్ట్రాల్లో భారీగా అభిమానులను సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో పైకొచ్చిన చిరంజీవి అంటే పడిచచ్చిపోయే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అన్నయ్యపై ఉన్న అభిమానాన్ని మెగా కాంపౌండ్ నుంచి వచ్చే ప్రతి హీరోకూ పంచుతున్నారు ఫ్యాన్స్. అయితే, చిరంజీవి తరవాత మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌కు ఉన్నంత క్రేజ్ ఎవ్వరికీ లేదు. నిజం చెప్పాలంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఉన్నా అక్కడ పవన్ స్టార్ నినాదాలే ఎక్కువగా వినిపిస్తాయి.సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయోత్సవ సభను రాజమండ్రిలో నిర్వహించారు. 
మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్ చిచ్చు

ఈ సభలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతున్నప్పుడు మళ్లీ పవర్ స్టార్ నినాదాలు హోరెత్తాయి. ఒక ఫ్లోలో మాట్లాడుతోన్న తేజూ వెంటనే.. ‘‘అఫ్‌కోర్స్ జై పవర్ స్టార్’’ అన్నారు. కాకపోతే ఫ్యాన్స్‌కి లైట్‌గా క్లాస్ పీకారు.పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వేర్వేరు కాదని.. అంతా ఒక్కటే అని అన్నారు సాయి తేజ్. ‘‘మనమంతా ఒక్కటి. ఇలా ఉంటే ఏమీ ఉండదు.. గుప్పిట బిగిస్తేనే బలం’’ అంటూ వేళ్లు విప్పిన చేతిని పిడికిలి బిగించి చెప్పారు. బన్నీ కూడా మెగా ఫ్యామిలేనని.. సెపరేట్ చేయవద్దని అన్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ నినాదాలు ఆగలేదు. దీంతో.. ‘‘రామ్ చరణ్, వరుణ్, శిరీష్, నేను అంతా ఒక్కటే. మెగా ఫ్యాన్స్ అభిమానం, దీవెనలు మా అందరికీ కావాలి’’ అని తేజ్ ముగించారు.మెగా కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ హీరోలుగా పరిచయమయ్యారు. వీళ్ల సినిమాలకు సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ పవర్ స్టార్ నినాదాలు ఎక్కువగా వినిస్తాయి. ఈ నినాదాలను మెగా కుర్ర హీరోలు ఎంజాయ్ చేసినా వారు మాట్లాడేటప్పుడు పదే పదే అడ్డుపడుతుంటే వాళ్లకూ చిర్రెత్తికొస్తుంది. ఏదో ఒకటి అంటారు. ఇక సోషల్ మీడియాలో తిట్ల దండకం మొదలవుతుంది. ఇలాంటి సందర్భాలు చాలా సార్లు వచ్చాయి. ఇది చూసి మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరంటూ సోషల్ మీడియాలో మిగిలిన హీరోల ఫ్యా్న్స్ ప్రచారం చేసిన సందర్భాలూ ఉన్నాయి.‘సరైనోడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని వేదిక కింది నుంచి ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దీంతో సహనాన్ని కోల్పోయిన అల్లు అర్జున్.. ‘చెప్పను బ్రదర్’ అనేశారు. తాను మాట్లాడుతుంటే ఇలా అడ్డుపడటం ఏంటని విసుక్కున్నారు. అంతే.. అప్పటి నుంచి బన్నీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో బన్నీ, పవన్ ఫ్యాన్స్‌కి మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వివాదం తరవాత ఓ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌ను బన్నీ ఆలింగనం చేసుకుని ‘మేమంతా ఒక్కటే’ అనే మెసేజ్‌ను ఇచ్చినా ఇప్పటికీ ఆయన్ని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు.పవర్ స్టార్ నినాదాలు హోరెత్తినప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆపమని చెప్పినా ఫ్యాన్స్ ఆపరు. చిరంజీవి నోటి వెంట పవర్ స్టార్ అనే పదం వచ్చేంత వరకు నినాదాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చిరంజీవికి కూడా చాలా సార్లు ఎదురయ్యాయి. అంతెందుకు నాగబాబు కూడా ఈ పవర్ స్టార్ నినాదాలపై ఒక ఈవెంట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ సంయమనం పాటించాలని కోరారు. ఆఖరికి నిహారిక సినిమా ఫంక్షన్‌లో కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారంటే వీళ్లది పిచ్చి అనాలో.. వెర్రి అనాలో అర్థం కాదు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని సెపరేట్‌గా పెట్టుకోవచ్చు కదా అని చాలా మందికి అనిపించి ఉండొచ్చు. కానీ, ఇది పవన్ కళ్యాణ్‌కే ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏపీ ఎన్నికలకు ముందు మెగా ఫ్యాన్స్‌తో ఆయన సమావేశమయ్యారు. అప్పుడు పవన్ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని నేను ఎందుకు పెట్టలేదంటే.. నాకు హీరో చిరంజీవి గారే. పవన్ కళ్యాణ్ నా హీరో కాదు. అన్నయ్యంటే నాకు అంతిష్టం’’ అని చెప్పారు. మరి ఫ్యాన్స్ మాత్రమే ఎందుకు పవన్‌ను ప్రత్యేకంగా చూస్తారు అంటే సమాధానం దొరకదు. అదంతే ఓ రకమైన పిచ్చి.. పవనిజం.