కిం కర్తవ్యం... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కిం కర్తవ్యం...

అమరావతి క్యాప్టలిస్టులు
విజయవాడ, డిసెంబర్ 26, (way2newstv.com)
మూడు రాజధానులు విషయంలో ఎపి సర్కార్ దూకుడును అడ్డుకోవడం ఎలా ? ఇప్పుడు అదే చర్చ అమరావతి లో పెట్టుబడులు పెట్టిన వారిలోను రాజధానికి భూములు ఇచ్చిన వారిలో చర్చనీయాంశంగా మారింది. జగన్ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి వున్న అన్ని మార్గాలను ఇప్పుడు వీరంతా ఆలోచన చేస్తున్నారు. దీనికి ప్రస్తుతం రెండే అవకాశాలు వారి ముందు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి న్యాయ స్థానం ద్వారా బ్రేక్ వేయించడం, రెండు కేంద్ర ప్రభుత్వం ద్వారా అడ్డుకోవడం గా అంచనా వేస్తున్నారు.ఏపీ రాజధాని అంశంలో ఎటు మాట్లాడినా లేక చర్యలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి తలపోటు గానే మారుతుంది. రాజధాని ఎక్కడ ఉండాలి అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఇష్టం పైనే ఆధారపడి ఉంటుందని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. 
కిం కర్తవ్యం...

అయితే పార్టీ పరంగా అమరావతి రైతులకు అన్యాయం చేయకూడదనే అంశంపై మాత్రం కమలం పార్టీ పోరాడతామని ప్రకటించింది. ఈ విషయంలో కూడా బిజెపి పెద్దగా జోరు చూపించే ఛాన్స్ లేదనే చెప్పాలి. అధికార వికేంద్రీకరణ ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అని గత ఎన్నికల్లో బిజెపి స్పష్టం చేసింది. కర్నూలు లో హై కోర్టు ఏర్పాటు చేయాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధి బిజెపి అజెండా లో వున్నాయి. వీటికి భిన్నంగా ఆ పార్టీ తన స్టాండ్ మార్చుకుంటే రాజధాని ప్రాంత రైతులు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో ఆ పార్టీ కి నష్టమే చేకూరుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలి నుంచి టిడిపి ఆధిపత్యమే అధికం, అమరావతికోసం చొక్కా చింపుకున్నా తమ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం ఉండదనే లెక్కే బిజెపి దూకుడు కి ముకుతాడు వేస్తుందని పరిశీలకుల అంచనా.అమరావతి అంశంపై కోర్టు కి ఎక్కినా విచారణ పూర్తి అయ్యి ఎప్పటికి న్యాయం జరుగుతుందో ఎవరికీ తెలియని అంశం. ఇప్పటికే సుప్రీం కోర్టు లో రాష్ట్ర విభజన అక్రమం అన్యాయం అంటూ దాఖలైన కేసులకు అతీగతీ లేకుండా పోయింది. విభజన జరిగి రెండు రాష్ట్రాల్లో పాలన కూడా సాగుతుంది. ఇంకా అనేక విభజన సమస్యలపై కోర్టుల్లో కేసులు మునిగి తేలుతున్నాయి. వాటికి దిక్కులేకుండా పోతుంది. మూడు రాజధానులపై ఇప్పుడు కోర్టులో విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశాలే వున్నాయి. ఇప్పటికే క్యాబినెట్ సమావేశం విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలైపోయాయి. అందులో కార్యనిర్వాహక రాజధాని ప్రకటించడం లాంఛనమే అవుతుంది. కోర్టు స్టే ఇచ్చినా సర్కార్ అనుకున్నదే చేసితీరుతుంది. ఈ నేపథ్యంలో అటు టిడిపి, ఇటు రాజధాని రైతులు, పసుపు పార్టీ మీడియా కిం కర్తవ్యం అంటూ కిందా మీదా పడుతుంది.