వంద దాటేసిన ఉల్లిపాయలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వంద దాటేసిన ఉల్లిపాయలు

హైద్రాబాద్, డిసెంబర్ 2, (way2newstv.com)
రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధర ఘాటెక్కింది. ఈ నెల మొదట్లో కిలో రూ.40 వరకు పలికిన ఉల్లిగడ్డ.. ఇప్పుడు వంద రూపాయలు దాటిపోయింది. హోల్సేల్ మార్కెట్లోనే రూ.80 దాటింది. ఇట్లా ధరలు పెరగడంతో రైతులు ఉల్లిగడ్డ ఇంకా పూర్తిగా ఊరకముందే మార్కెట్కు తరలిస్తున్నారు. దాంతో పచ్చి ఉల్లిగడ్డ, అది చిన్నసైజువి ఎక్కువగా వస్తున్నాయి. ఈసారి ఖరీఫ్ ప్రారంభంలో వానల్లేక ఉల్లిసాగు తగ్గిందని, వేసిన పంట కూడా అక్టోబర్లో పడ్డ భారీ వర్షాలతో కొంత దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉండటం, పంట పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా 20 రోజుల వరకు సమయం ఉండటంతో.. కొద్దిరోజులు ధరలు ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొన్నాయి.ఈ ఏడాది ఖరీఫ్‌‌‌‌ ప్రారంభంలో వానల్లేక ఉల్లి సాగు సాగు విస్తీర్ణం తగ్గింది. 
వంద దాటేసిన ఉల్లిపాయలు

రాష్ట్రంలో ఖరీఫ్‌‌‌‌లో ఉల్లి సాధారణ సాగు 13,094 ఎకరాలుకాగా.. ఈసారి 4,084 ఎకరాల్లోనే వేశారు. దీనికితోడు అక్టోబర్‌‌‌‌ లో కురిసిన భారీ వర్షాలతో పంట భారీగా దెబ్బతిన్నది. సాగు ఏకంగా 69 శాతం తగ్గిపోవడం, వేసిన పంటలోనూ దిగుబడి తగ్గే అవకాశం ఉండటం ఇబ్బందికరంగా మారిందని మార్కెటింగ్‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. ఉల్లిగడ్డ ఎక్కువగా పండించే మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ అక్టోబర్లో వర్షాలకు పంటంతా దెబ్బతినడంతో మొత్తం పీకేసి.. మళ్లీ ఉల్లిసాగు చేశారు. అది పూర్తిస్థాయి దిగుబడి రావాలంటే డిసెంబర్‌‌‌‌  చివరి వరకు ఆగాల్సి ఉంది. కానీ మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో చిన్న గడ్డనే మార్కెట్‌‌‌‌కు తరలిస్తున్నారు. దేశంలోనే పెద్ద ఉల్లి మార్కెట్ అయిన నాసిక్‌‌‌‌ జిల్లా లాసల్‌‌‌‌గావ్‌‌‌‌లో హోల్‌‌‌‌సేల్‌‌‌‌ ధరలు రెట్టింపయ్యాయి. నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ క్వాలిటీ ధర క్వింటాల్కు రూ.8 వేల వరకు పలుకుతోంది. పెద్ద ఉల్లిగడ్డలు ఉన్న పాత స్టాక్కు కిలో రూ.100 దాటింది.ఉల్లిగడ్డ ధర హోల్‌‌‌‌సేల్‌‌‌‌ మార్కెట్లోనే రూ.80 దాటింది. కొద్దిరోజుల కింద క్వింటాల్ రూ.3,500 వరకు ఉండగా ఇప్పుడు రూ.8 వేలకుపైగా పలుకుతోంది. ప్రస్తుతం ఉల్లి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. పది రోజుల కిందటి వరకు రోజూ 70 నుంచి 100 లారీల లోడ్ వచ్చేదని, ధర పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరిగిందని మలక్‌‌‌‌పేట మార్కెట్‌‌‌‌ గ్రేడ్‌‌‌‌–3 అధికారి నరేందర్‌‌‌‌ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్‌‌‌‌శాఖ చర్యలు చేపట్టింది. ఉల్లి వ్యాపారుల సహకారంతో రైతు బజార్లలో ఒక్కొక్కరికి కిలో రూ.40 చొప్పున పంపిణీ చేస్తోంది. హైదరాబాద్‌‌‌‌ లోని ఫలక్‌‌‌‌నుమా, వనస్థలిపురం, సరూర్‌‌‌‌నగర్, మెహిదీపట్నం రైతు బజార్లలో ఉల్లిగడ్డ విక్రయించేలా ఏర్పాట్లు చేసింది.గుజరాత్‌‌‌‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఏపీలోని కర్నూల్‌‌‌‌ నుంచి ఉల్లిగడ్డ దిగుమతి అవుతుంది. ఇక రాష్ట్రంలోని మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, జోగులాంబ గద్వాల, మెదక్‌‌‌‌, నారాయణ్‌‌‌‌ఖేడ్‌‌‌‌ ప్రాంతాల్లో ఉల్లిసాగు చేస్తారు. ఈసారి వికారాబాద్‌‌‌‌ జిల్లాలోని తాండూరు, మెదక్‌‌‌‌ జిల్లాలోని నారాయణఖేడ్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలోని కొల్లాపూర్‌‌‌‌, అలంపూర్‌‌‌‌, నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగు చేశారు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌, అక్టోబర్ నెలల వరకు రాష్ట్రంలో ఉల్లి దిగుబడి వస్తుంది. నవంబర్ నుంచి మార్చి వరకు కర్నాటక నుంచి, రోజువారీగా మహారాష్ట్రలోని నాసిక్‌‌‌‌ నుంచి దిగుమతి అవుతుంది