మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి మానవ హక్కుల కమిషన్‌ బృందం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి మానవ హక్కుల కమిషన్‌ బృందం

హైదరాబాద్‌ డిసెంబర్ 7 (way2newstv.com)
 దిశ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. నలుగురు సభ్యుల ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకుంది. ముందుగా ఈ బృందం ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల మృతదేహాలను .. మృతుల తల్లిదండ్రులు, వారి తరఫున వైద్యుల సమక్షంలో పరిశీలించింది. మృతుల తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది. అనంతరం చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనుంది. కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించిన విషయం తెలిసిందే. 
మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి మానవ హక్కుల కమిషన్‌ బృందం

ఎన్‌కౌంటర్‌పై తమకు సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేంతవరకూ మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించరాదంటూ జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీ రూమ్‌లో భద్రపరిచారు. కాగా క్షణం క్షణం ఉత్కంఠ భరితం. కుయ్‌... కుయ్‌ అంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాస్పత్రికి చేరుకుంటోన్న అరగంటకో వాహనం.. ఏ వాహనంలో ఎవరు..? ఎప్పుడొస్తున్నారో తెలియదు. ప్రతి వాహనంలో వస్తున్న పోలీసు అధికారులకు స్థానిక డీఎస్పీ, ఇతర అధికారుల సెల్యూట్‌. గేటు ముందు వాహనాలు నిలిపి.. ఆస్పత్రిలోకి వెళ్లిన అధికారులు. కొందరు ఫోరెన్సిక్‌ నిపుణులంటే.. ఇంకొందరు ఇంటెలిజెన్స్‌ అధికారులని పోలీసుల చర్చలు. ఆస్పత్రి చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. ఇంతకు జిల్లాస్పత్రిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనం..! ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.40గంటల వరకు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన పోలీసులు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుల మృతదేహాలకు పూర్తయిన పోస్టుమార్టం. ఇదీ మహబూబ్‌నగర్‌ జిల్లాస్పత్రి ముందు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి  రాత్రి 7గంటల వరకు నడిచిన హైడ్రామా. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ‘దిశ’ నిందితుల పోస్టుమార్టం ఉమ్మడి జిల్లా పోలీసులకే కాదూ హైదరాబాద్‌ నుంచి వచ్చిన పోలీసు అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఉత్కంఠతో పోలీసులు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించారు.