భల్లే...భల్లేగా పూల వ్యాపారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భల్లే...భల్లేగా పూల వ్యాపారం

గుంటూరు, డిసెంబర్ 14, (way2newstv.com)
గుంటూరు జిల్లాల్లో పూల వ్యాపారం  బేషుగ్గా సాగుతోంది. ఇక్కడ మల్లె, జాజి, బంతి, గులాబి, నాటు గులాబి, ఐదు రకాల చేమంతులు, కనకాంబరాలు, కాగడాలు, లిల్లీ పూలను సాగుచేస్తున్నారు. వాటితో పాటు.. లైను ఆకు, తులసి ఆకు, మరువం ఆకులనూ విస్తృతంగా పండిస్తున్నారు. ఏ సీజన్‌లో పూసే పూలను ఆ సీజన్‌లో సాగుచేస్తారు. ఆ ఉత్పత్తులను వెదుళ్లపల్లిలోని పూల మార్కెట్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, కడప, నెల్లూరుతో పాటు.. హైదరాబాద్, చైన్నె నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పూలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి పూల తోటల వల్ల దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.  బాపట్ల రూరల్‌ పరిధిలోని బేతపూడి, వెదుళ్లపల్లె, కొత్తపాలెం, తులసినగరం, బోయినవారిపాలెం, వృక్షనగర్, మహాత్మాజీపురం, వైఎస్సార్‌నగర్, సుబ్బారెడ్డిపాలెం, ఉప్పరపాలెం, మున్నవారిపాలెం, దరువాది కొత్తపాలెం గ్రామాల్లోని ప్రజలకు పూలసాగే ప్రధాన జీవనాధారం. 
 భల్లే...భల్లేగా పూల వ్యాపారం

ఇక్కడ ఒక్కో గ్రామంలో సుమారు 500 నుంచి 1,500 కుటుంబాలు దాకా ఉన్నాయి. ఒక్కో కుటుంబం కనిష్టంగా 10 సెంట్ల నుంచి గరిష్టంగా రెండు ఎకరాల్లో పూలను సాగు చేస్తున్నాయి. అన్ని గ్రామాల్లో కలిపి దాదాపు 1,500 నుంచి 2,500 ఎకరాల్లో పూల తోటలు సాగవుతున్నాయి. ఇక్కడి వారంతా తరతరాలుగా పూల సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు బేతపూడి గ్రామంలో 1,600 కుటుంబాలుండగా.. వారిలో దాదాపు 1,550 కుటుంబాలు పూల సాగుమీదే ఆధారపడి జీవిస్తున్నాయంటే.. ఈ ప్రాంతంలో పూలసాగుకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 2004లో వైఎస్సార్‌ సీఎం అయ్యాక.. ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పుణ్యమాని పూల సాగు ఒక్కసారిగా విస్తృతమైంది. తోటలే కాదు.. ఇళ్ల పరిసరాల్లో ఏ కొంచెం జాగా ఉన్నా పూల మొక్కలే దర్శనమిస్తాయి.అన్ని ఖర్చులూ పోనూ ఒక్కో రైతు రోజుకు కనీసం రూ.500–600 వరకూ సంపాదిస్తున్నాడు. పండుగల సీజన్‌లో పూలకు భారీగా డిమాండ్‌ ఉండటంతో ఆదాయం మరింత పెరుగుతుంది. ధర లేనప్పుడు ఒక్కోసారి కోత కూలి కూడా రాని సందర్భాలున్నాయని రైతులు చెబుతున్నారు. ఇక ఇళ్ల పరిసరాల్లో జాజి, మల్లె, కనకాంబరాలను సాగుచేస్తున్నారు. వీటి ద్వారా రోజుకు కనీసం రూ.100 దాకా ఆదాయం వస్తుంది. పండుగల సమయాల్లో రోజుకు రూ.300–400 వరకూ మిగులుతాయని చెబుతున్నారు.