ట్రంప్ కు బిగిస్తున్న ఉచ్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్రంప్ కు బిగిస్తున్న ఉచ్చు

న్యూయార్క్, డిసెంబర్ 19 (way2newstv.com)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు దిగువ సభలో అభిశంసన తీర్మానం బుధవారంప్రవేశపెట్టారు. ఈ అభిశంసన తీర్మానానికి మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటువేయడంతో ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానికి అనుకూలంగా 230 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ సెనేట్‌లో విచారణ ఎదుర్కోనున్నారు. అక్కడ కూడా ఈ తీర్మానం ఆమోదం పొందితేనే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది.
ట్రంప్ కు బిగిస్తున్న ఉచ్చు

అయితే, ఎగువ సభ సెనేట్‌లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండటంతో ఆయన అభిశంసనకు గురయ్యే అవకాశాలు దాదాపు ఉండవు. వచ్చే జనవరిలోనే ఆయన సెనేట్‌లో విచారణను ఎదుర్కోనున్నారు. మరోవైపు, తనపై ప్రారంభించిన అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీకి ట్రంప్‌ ఘాటు లేఖ రాశారు. తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ట్రంప్ విధానాలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకుని, అమెరికా రెండుగా విడిపోయిందని డెమోక్రాట్లు తమ తీర్మానంలో పేర్కొన్నారు.కాగా, అభిశంసన ఎదుర్కొంటున్న మూడో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అంతేకాదు, 243 ఏళ్ల అమెరికా చరిత్రలో అభిశంసన ద్వారా ఇంత వరకు ఏ అధ్యక్షుడూ తన పదవి నుంచి తప్పుకోలేదు. ఇక, సెనేట్‌లోని 100 మంది సభ్యుల్లో రెండొంతుల మంది తీర్మానానికి అనుకూలంగా వేటువేస్తేనే ట్రంప్ అభిశంసనకు గురవుతారు. అయితే, ప్రస్తుతం రిపబ్లికన్‌ల ఆధిపత్యం ఇక్కడ కొనసాగడంతో ఈ తీర్మానం వీగిపోనుంది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమవుతోన్న ట్రంప్.. గత ఎన్నికల్లో తన విజయాన్ని ఓర్వలేకే డెమోక్రాట్లు అభిశంసన ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు