దూకుడు పెంచిన గల్లా జయదేవ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దూకుడు పెంచిన గల్లా జయదేవ్

గుంటూరు, జనవరి 21, (way2newstv.com)
విజిటింగ్ ఎంపీగా పేరు తెచ్చుకున్న గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. అనూహ్యంగా దూకుడు పెంచారు. వ‌రుస‌గా రెండోసారి గుంటూరు నుంచి విజ‌యం సాదించిన గల్లా జ‌య‌దేవ్‌ తాజాగా రాజ‌ధాని పోరులో త‌న స‌త్తా చాటుకుంటున్నారు. గ‌ల్లా జయదేవ్ దూకుడు సొంత పార్టీ నేత‌ల‌కే షాక్ ఇచ్చేలా ఉంద‌న్నది ఇప్పుడు జిల్లా టీడీపీ వ‌ర్గాల్లో త‌ర‌చూ వినిపిస్తోన్న మాట‌. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో అమ‌రావ‌తి పోరు జ‌రుగుతోన్న ప్రాంతాల్లో నిత్యం ఆయ‌న ప‌ర్యటిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రైతుల‌ను నిత్యం క‌లుస్తున్నారు. వారిలో భ‌రోసా నింపుతున్నారు., దీక్షా శిబిరాల‌కు మ‌ద్దతిస్తున్నారు.త‌న‌దైన శైలిలో ప్రసంగాలు చేస్తున్నారు. దీంతో ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు అరె.. గ‌ల్లా ఒక్కసారిగా మారిపోయాడేంటి? అని చ‌ర్చించుకోవ‌డం క‌నిపిస్తోంది. 
దూకుడు పెంచిన గల్లా జయదేవ్

ఇక‌, గ‌ల్లా జయదేవ్ దూకుడు చూస్తున్న విప‌క్షాలు, అధికార ప‌క్షం వాళ్లే కాదు చివ‌ర‌కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జ‌నాలు కూడా షాక్‌కు గుర‌వుతున్నారు. వాస్తవానికి 2014 ఎన్నిక‌ల్లో తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చినప్పటికీ గ‌తంలో గ‌ల్లా జయదేవ్ తల్లి గ‌ల్లా అరుణ కుమారి రాజ‌కీయాల్లో త‌న‌దైన పేరు తెచ్చుకున్నారు. చిత్తూరులోని చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఆమె ప‌లుమార్లు వ‌రుస విజ‌యాలు సాధించి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా ప‌నిచేశారు.త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో కాంగ్రెస్‌ను విడిచి పెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఈ కుటుంబం నుంచి గల్లా జ‌య‌దేవ్‌ టీడీపీ త‌ర‌పున గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెల‌వ‌గా చంద్రగిరిలో గ‌ల్లా అరుణ మాత్రం ఓడిపోయారు. ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పట‌కి గల్లా జ‌య‌దేవ్ త‌న వ్యాపార కార్యక‌లాపాల్లోనే మునిగి తేలారే త‌ప్ప ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించింది లేదు. ఇక్కడి స‌మ‌స్యల‌ను కూడా ప‌ట్టించుకున్నది కూడా లేదు. అందుకే గల్లా జ‌య‌దేవ్‌ను అంద‌రూ విజిటింగ్ ఎంపీ పేరుతో పిలుచుకునేవారు.రాజ‌ధాని ప్రాంతం కావ‌డంతో టీడీపీ అధినేత చంద్రబాబు మ‌కాం ఉండ‌డంతో పాటు అటు మంత్రులు, స‌చివాల‌యం హ‌డావిడితో అసలు గల్లా జ‌య‌దేవ్‌ను ప‌ట్టించుకునే వాళ్లే లేరు. ఇక‌, ప్రత్యేక హోదా విష‌యం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత‌ ఒక‌సారి పార్లమెంటులో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్‌.. అంటూ.. చేసిన ఒకే ఒక ప్రసంగం త‌ప్ప గ‌ల్లా జయదేవ్ ఖాతాలో పెద్దగా ప్లస్‌లు ఏమీలేవు. ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ భారీ ఎత్తున ఉన్నప్పటికీ.. త‌న స‌త్తా చాటుకున్నారు. ఈక్రమంలో అతి క‌ష్టంమీద గెలుపు గుర్రం ఎక్కారు.రెండోసారి గుంటూరు ఎంపీగా గల్లా జ‌య‌దేవ్ గెలుపే సంచ‌ల‌నం అయ్యింది. అయినా కూడా త‌ర్వాత నాలుగు మాసాలు ఆయ‌న పెద్దగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొన‌లేదు. కానీ, ఇప్పుడు రాజ‌ధాని విష‌యం తెర‌మీద‌కి వ‌చ్చాక ప్రతి దీక్షా శిబిరాన్నీ సంద‌ర్శిస్తున్నారు. ఆయ‌నతోపాటు ఆయ‌న త‌ల్లి అరుణ కూడా చంద్రగిరి పాలిటిక్స్ ను ప‌క్కన పెట్టేసి మ‌రి అమ‌రావ‌తి మూమెంట్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. జ‌య‌దేవ్ తాడికొండ‌, మంగ‌ళ‌గిరి, గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో కంటిన్యూగా ప‌ర్యటిస్తున్నారు. ఇక ఇటీవ‌ల తెనాలిలో మాజీ ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర చేప‌ట్టిన నిర‌స‌న దీక్షకు మ‌ద్దతు ప‌లికారు. తెనాలి వీధుల్లో జోలె ప‌ట్టారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు గల్లా జ‌య‌దేవ్‌లో అనూహ్యంగా వ‌చ్చిన మార్పు చూసి అచ్చెరువొందుతుండ‌డం గ‌మ‌నార్హం. మా ఎంపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో గాని ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఇంత క‌ష్టప‌డ‌లేద‌ని చ‌ర్చించుకుంటున్నారు.